పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనవి మాట

'ఇంద్రాణీ సప్తశతీ' యను నీ గ్రంథము మహత్తరమైన స్తోత్ర కావ్యము. దీనిని రచించిన కావ్యకంఠ శ్రీవాసిష్ఠ గణపతిముని యాంధ్రుడు. బొబ్బిలికి సమీపమందున్న కలువఱాయియను గ్రామము నివాసముగా గల్గిన తల్లిదండ్రు లీయన జన్మించుటకు పూర్వము పొందిన కొన్ని దివ్వ దర్శనములచే నీయన తమ యిష్టదైవమగు గణపతియొక్క యంశసంభూతుడని విశ్వసించి యీయనకు గణపతి యను పేరిడిరి. వారి విశ్వాసమునకు తగిన ట్లీయనయం దసాధారణ ధీవిక్రమము, వాక్సిద్ధి, యాశుకవితాప్రజ్ఞ మొదలగు దివ్యవిలాసములు బాల్యమందే ప్రస్పుటమగుట జూచి తమ విశ్వాసమును ద్రువపరచుకొనిరి. కాని, బాలగణపతి వారి నమ్మకమును కాదనకున్నను తన కా దైవాంశానుభవ మాంతర్యమున గల్గకుండుట గుర్తించుకొని, తత్ప్రాప్తికొఱ కీశ్వరానుగ్రహమును సాధించుటకు పదునాఱవయేటనుండి తపస్సును బూనెను.

అత్యంత భక్తిశ్రద్ధలతోడను, శాస్త్రములనుండియు పెద్దలవల్లను గ్రహించిన విధివిధానములతోడను నాచరింపబడిన యీ తపస్సునం దచిరకాలములోనే భువనేశ్వరీ యనుగ్రహమున దివ్యావాగ్రస ప్రవాహమును, ఈశ్వరానుగ్రహమున నిర్విషయధ్యాస యోగమును బడసినను దృప్తిజెందక తన తపస్సునకు ఫలముగా నిజతపస్స్వరూపాపానుభవమునే కాంక్షించుచు సుమారు పండ్రెండు సంవత్సరములు పాటు పడెను. కాని లక్ష్యము సిద్ధించ లేదు. అప్పుడు వేదశాస్త్రభాష్యము లందును, పురాణేతిహాసములందును పేర్కొనబడిన తపఃపదనిర్వచనములనే శంకించుకొని, దాని యదార్థమును తర్కించుకొనుచుండగా నొక ప్రేరణము బొంది యరుణాచలక్షేత్రమున 1907 సం||లో కృత్తికోత్సవముల సమయమునకు ధ్యానదీక్షబూనెను. ఈశ్వరకృప