హర్షగోపుడు బాలనాగిని తలచుకొనెను. ఆ బాలిక మాట్లాడదు. ఆ ముద్దరాలికి దనపై ప్రేమయున్నదని చెప్పక చెప్పినది. ఆమె హిమబిందుకుమారిని ఈమధ్య వదిలియే యుండుటలేదు అనుకొనుచుండెను.
“నిను తలచి ఏ వేళలన్
కనుమూయ దా చిన్నదీ!
అనిమిషత్వముచెంది పోనో-ఏలనో ఈ వేదనా?”
బాలనాగియు తన్ను తలచుకొనుచుండును. ఆమెయు ఇటులనే బాధ పడుచుండునా? ఎక్కడిమాట!
ఇంతలో ఆ మదిరశాలాధికారి యొకడు మోమునకు చిరునవ్వు దెచ్చుకొని హర్షగోపునికడకు వచ్చి “ఇంద్రగోపుడు క్షేమముగనున్నాడా?” అని ప్రశ్నించెను.
“సుఖముగ నున్నాడు. చారుగుప్తులవారి ధనదపురగోశాలను పరీక్ష చేయబోయినాడు.”
“అమ్మాయిగారు హిమబిందుకుమారి కొంచె మస్వస్థతగ నున్నదని వింటిని. ఎట్లున్నది?”
“జబ్బేమియు లేదు. తండ్రిగారు యుద్ధమునకుపోయినారని ఆమె బెంగ పెట్టుకొన్నది.”
“అంతేనా! వారిచుట్టము లెవ్వరు రాలేదా?”
“ఆ! కోటీశ్వరులకుటుంబములలో ఎవరిపని వారి కుండును. అందరును ఒకసారి వచ్చి చూచినారు. వినయగుప్తులవారు మనుమరాలికి ధైర్యముగ నుండుటకు ఇంటికడనే వసించుచున్నారు. కీర్తిగుప్తులవారు ఒక నిమిషము మనుమరాలి నెడబాయుటలేదు. వా రిరువురు తమ యాత్రా విశేషములు కథగా చెప్పి ఆ బాలికకు సంతోషము గొలుపుచున్నారు.”
“హిమబిందుకుమారి సౌందర్యము ఏ రాచకన్నెకును లేదు.”
“అవును. మే మెవ్వరము తలయెత్తియైన యామెను చూడలేము. ఆమెకుదృష్టి తగులునేమో యని మాకు భయము. ఆ తల్లి దేవత.”
“ఇంటిదగ్గర ముక్తావళీదేవియు, అమృతలతాదేవియు నున్నారట కాదా?”
“అవును. ఎంతమంది యున్నను ఆ తల్లి కేదో విచారమే అని చెలికత్తెలందరు చెప్పుకొందురు.”
హర్షగోపుడు బాలనాగిని తలచుకొనుచునే వెడలిపోయెను.
అతడు చారుగుప్తునికోటగోపురము చేరునప్పటికి సూర్యుడస్తమించి నాళికపైన దాటినది. ఎటుల బాలనాగిని చూచుట? ఆమె తన ఇంటికి రాణిగా రాజ్యముచేయుచుండ ఆమెను బంగారునగలలో, రంగారు దుకూలములలో దేవకన్యనుగా తాను మార్చివేయ లేడా? ఆ తల్లి హిమబిందుకుమారితో తనబాధ చెప్పికొనిన ఆమె తనపై జాలిగొనునేమో?
అనుకొనుచు నాతడు అంతఃపురముదెసకు బోయి, అమ్మాయిగారితో హర్షగోపు డేదియో మనవిచేసికొన వచ్చినా డని వినతి పంపెను.
హిమబిందును, బాలనాగియు తోటలో నున్నారని వార్త వచ్చినది. ఒక చెలి హిమబిందుకుమారితో విన్నవించుటకు వెడలినది.
అడివి బాపిరాజు రచనలు - 2
146
హిమబిందు (చారిత్రాత్మక నవల)