Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

వీరవరుఁ డైనతనయుని విపినయాత్రఁ, దలఁచి శోకాగ్నిచే గ్రాఁగి తనువు విడుచుఁ
గాని కౌసల్య మని యుండఁ గలదె యింక, నాయమవితాన మాయమ్మ యడలుఁ గాదె.

1674


క.

గ్రద్దన భూమిశ్వరుఁ డా, యిద్దఱముద్దియలపాటు హృదయంబునఁ దాఁ
బెద్దయుఁ జింతించి ఘనవి, పద్దశఁ బ్రాపించి మేనుఁ బాయు నిజముగాన్.

1675


ఆ.

ఇట్టిమాట దలఁప నెంతయు నాగుండె, యవియుచున్న దట్టియడలు మాని
సమ్మదమున నేఁడు ఱొమ్మునఁ జె య్యిడి, నిద్రవోవ నెట్లు నేర్తు నయ్య.

1676


తే.

ఏను లే కున్న మజ్జనయిత్రి పిన్న, కొడుకు నీక్షించి జీవించు నడలు దక్కి
యీమహాత్ముఁడు లేకున్న హితవరేణ్య, యేకసుత యైనకౌసల్య యెట్లు బ్రతుకు.

1677


తే.

రామభద్రునిఁ గోసలరాజ్యపట్ట, భద్రుఁ జేసి మనోరథప్రాప్తి గాక
మున్నె భూపతి పరలోకమునకుఁ బోవుఁ, గార్యమంతయు వ్యర్థమై కడచె నకట.

1678


వ.

అమ్మహాత్ముండు మావచ్చునందాఁక మని యుండఁ డేని యతని సంస్కరించి
భరతాదులు సిద్ధార్థు లై రమ్యచత్వరసంస్థానంబును సువిభక్తమహాపథంబును
రమ్యప్రాసాదసంపన్నంబును సర్వరత్నవిభూషితంబును గజాశ్వరథసంబాధం
బును దూర్యనాదవినాదితంబును సర్వకళ్యాణసంపూర్ణంబును హృష్టపుష్ట
జనాన్వితంబును నారామోద్యానసంపన్నంబును సమాజోత్సవసంకులంబు
నగుసాకేతనగరంబున సుఖంబు లనుభవించుచుండుదు రేను సమయకాలం
బతీతం బగుచుండఁ గృతప్రతిజ్ఞుం డై సేమంబున నున్నరామునిం గూడి మర
లఁ బురంబుఁ బ్రవేశించుభాగ్యంబుఁ గాంతునా యని యేతాదృశంబు లగు
దుఃఖాలాపంబులు నాతో నాడుచుండ నంతలోనఁ బ్రభాతకాలంబయ్యె నంత
రాముండు మేల్కాంచి తానును లక్ష్మణుండును నిమ్మహానదీతీరంబున జటా
వల్కలంబులు ధరించి బాణబాణాసనకృపాణంబులు ధరించి వ్యపేక్షమాణు లై
సీతాసహితంబుగా నిమ్మహానది నుత్తరించి గజయూథపులచందంబున సుఖ
లీలం జని రని యిట్లు గుహుండు రామవృత్తాంతంబును లక్ష్మణుని పరిదేవనం
బును సవిస్తరంబుగా నెఱింగించిన విని సుకుమారుండును మహాసత్త్వుండును
సింహస్కంధుండును మహాభుజుండును బుండరీకవిశాలాక్షుండును దరుణుం
డును బ్రియదర్శనుండు నగుభరతుండు స్వాభిలషితకార్యసంకటంబు సంజాతం
బయ్యె నని చింత నొంది ముహూర్తమాత్రంబు పరమదుర్మనస్కుం డై పదం
పడి తోత్రవిద్ధం బైనమహాద్వీపంబు కైవడిఁ బుడమిపయిం బడియె నతని
దురవస్థఁ జూచి యాసన్నస్థితుం డైనశత్రుఘ్నుండు శోకకర్శితుం డై యతనిం
గౌఁగిలించికొని యుచ్చైన్నాదంబున రోదనంబుఁ జేయుచుండె నయ్యిద్దఱం
బరికించి భర్తృవ్యసనకర్శిత లగురాజకాంతలు హాహాకారంబులు సేయుచు