పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

గోన గన్నా రెడ్డి

3

ఓరుగల్లులో, రాచనగరులున్న లోపలికోటలో, అంతా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నది. వృద్ధులయిన శ్రీ శ్రీ గణపతి రుద్రదేవ చక్రవర్తి తన సౌధ నగరిలో, స్వయంభూదేవారాధనతత్పరుడై చల్లగా కైలాసేశ్వర పాదపద్మారాధనకై ఈ దేహం చాలించి ఎప్పుడావెళ్ళడము అని నిరీక్షిస్తున్నారు.

అత్యంతావసరమైతేగాని తమతో రాజ్యవిషయాలు చర్చింపవద్దని చక్రవర్తి ఆజ్ఞచేశారు. మహామంత్రులైన శివదేవయ్యదేశికేంద్రులు శివమాహాత్మ్యం, శైవ వేదాంతం వినిపిస్తూ ఉంటారు. మహాకవు లనేకులు తమ తమ రచనలు వారికి చదివి వినిపించి, ఆ సార్వభౌములవల్ల బహుమతులు, అగ్రహారాలు, ధనరాసులు పొందుతూ ఉంటారు.

కవిబ్రహ్మ, వుభయకవిమిత్రుడు సింహపురాన్నుంచి తాను రచించిన ఆంధ్ర మహాభారత పర్వాలు, ఆశ్వాసాలు ఎప్పటికప్పుడు ఆంధ్రసార్వభౌముని కడకు పంపిస్తున్నారు. అవి పంపించడం ప్రారంభించి మూడుసంవత్సరాలైనది. విరాటోద్యోగములు, భీష్మ ద్రోణపర్వములు పూర్తిఅయినవి. చక్రవర్తి శ్రీ తిక్కకవి సోమయాజి దివ్యకవితామృతంలో ఓలలాడుచూ ఎప్పుడు తదితర పర్వాలూ వస్తాయా అని ఎదురుచూస్తూవుండెను.

ఒక వుదయమున సార్వభౌమునికడకు శివదేవయ్యమంత్రి, శ్రీ శ్రీ రేచెర్ల ప్రసాదాదిత్యప్రభువు విచ్చేసినారు. చక్రవర్తి శివదేవదేశికులకు లేచి నమస్కారం చేసినారు. చక్రవర్తికి ప్రసాదాదిత్యుడు మోకరించి నమస్కరించినాడు. వారిని కూర్చుండ నియమించి డెబ్బదిఏండ్ల యా వృద్ధచక్రవర్తి తాను తన పల్యంకసింహాసనంపై కూరుచుండి, దిండులమీద ఒదిగి “గురుదేవా ! ఉదయమే దయచేశారు!” అని ప్రశ్నించారు.

శివ : ప్రభూ : ఒక్కనిమేషము ఏకాంతం ఇప్పించాలి.

అక్కడ వివిధాసనములపై అధివసించి శివదేవయ్యదేశికులు రాగానే సార్వభౌమునితోపాటు లేచిన పండితాది బ్రాహ్మణులు, ఆరాధ్యులు, జంగమ గురువులు లేచి ఆవలికి వెళ్ళిపోయిరి. కంచుకు లా మహామందిర కవాటములు బంధించి తాము వెడలిపోయిరి.

శివ : మహాప్రభూ! వివిధ దేశాలలో త్రిలింగ సామ్రాజ్యంపై కుట్ర లెక్కు వౌతున్నవి.

గణ : ఎవరు? ఏలా కుట్రసలుపదలుచుకున్నారు? రెండేళ్ళనాడు సామంతులందరూ వచ్చి తమ రాజభక్తిని ప్రమాణపూర్వకంగా ప్రకటించి వున్నారుకదా!