పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

304

గోన గన్నా రెడ్డి

కుప్పాంబికాదేవి కొమరితను వరదారెడ్డికి ఇచ్చుటకు ఒప్పందంచేసి గన్నారెడ్డి తిరిగి ఓరుగల్లు వేంచేసినాడు.

వరదారెడ్డి విఠలయ్యను వదలడు. చిన్నన్నగారితో పెద్దన్నగారి వివాహం అయితేగాని తాను వివాహం చేసుకోనంటాడు. విఠలయ్య అన్నగారితోమాటలాడడు. అక్కినప్రగడకూ ధైర్యం చాలదు.

చక్రవర్తి ఆజ్ఞ అయినా గన్నారెడ్డి వర్థమానపురం వెళ్ళనే వెళ్ళడు. పట్టాభిషేకం మాట తలపెట్టితే ప్రతివచన మివ్వడు.

ఆ దినము చినఅక్కినప్రగడ, విఠలయ్య, సూరనరెడ్డి, వరదారెడ్డి, విఠలయ్య నగరిలో ఆసీనులై ఉన్నారు.

విఠ: ఏమిటి అన్నయ్యగారి ఉద్దేశం?

సూరన్న: నాకు యుద్ధం అంటే ఏమిటో తెలుసును. ఇలా మౌనవ్రతం పూనడం అంటే భయం కలుగుతుంది. ఎందుకు మనప్రభువు అలా గుఱ్ఱంఎక్కి దినదినమూ ఓరుగల్లు చుట్టుప్రక్కల గ్రామాలన్నీ తిరిగివస్తూ ఉంటారు?

అక్కిన: ప్రేమ అనేది ఒక రోగం. అది సోకితే జ్వరం, తల తిరగటం, మతిపోవడం మొదలయిన లక్షణాలన్నీ కలుగుతాయి!

సూరన్న: వచ్చిందీ ఆ ప్రేమవిషయం? నాకుమాత్రం ఆ విషయాలేమీ తెలియవు. మల్యాల కాటయసేనాపతుల అమ్మాయిని ఇస్తామని మా తండ్రిగారు వార్తపంపారు. మానాయకులు ఒప్పుకుంటే నా కభ్యంతరం లేదన్నాను.

విఠ: ఆ విషయంలోనూ నాయకుల ఆజ్ఞే?

సూరన్న: భోజనవిషయాలలోనూ నాయకుల ఆజ్ఞే?

విఠ: బావా! త్వరగా నువ్వే వైద్యం చెయ్యాలి. వర్థమానపురం ఎప్పుడు వెళ్ళేది?

అక్కినప్రగడకూ గన్నారెడ్డి ఆవేదన అర్థంకాలేదు. అన్నాంబికాదేవిని తల్లిదండ్రులు ఆదవోనికి తీసుకుపోయారు. ఆమె పురుషవేషంతో గన్నారెడ్డిని ఛాయలా అనుసరించింది మా ప్రభువునకు యుద్ధం తప్ప ఇంకేమీ రుచించదేమో?

మొన్న చక్రవర్తి దేవగిరిలో ఉన్నప్పుడు ఱాపాక భీముడు బలగాలు కూర్చుకొని తాను స్వతంత్రుడననిన్నీ, స్త్రీ సామ్రాజ్యమున ఉన్న పురుషుడంత హీను డింకొక డుండడనీ తన రాజ్యం అంతా చాటించినప్పుడు పిట్టపిడుగులా బావగారు తమందరను నడుపుకుంటూ ఱాపాక చేరి, ఆవెఱ్ఱిబాగుల భీముణ్ణి నిర్థూమధామం చేశారు.

యుద్దవ్యూహా లెరిగినవాళ్ళకు ప్రణయవ్యూహారచన తెలియదేమో?

ఈ ఆలోచనలతో అక్కినప్రగడ తన ఇంటికి చేరినాడు.