పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమ గాథ

కృష్ణవేణి

1

శాలివాహన శకం 1185 రుధిరోద్గారి సంవత్సర మాఘ బహుళ చతుర్దశి రాత్రి శివరాత్రి మహాపుణ్యకాలంలో తన కోటలోనే నమకమంత్ర యుక్తంగా శివాభిషేకం చేస్తూ శ్రీ శ్రీ గణపతి రుద్రదేవ సప్తమ చక్రవర్తి వెనక్కు వాలి పోయారు. పరమ మహేశ్వరులైన శివగురువు ‘దేవా, ఏమిటిది?’ అంటూ ఒక అంగలో చక్రవర్తిని చూచేసరికి ఆయన విగతజీవియై ఉన్నాడు. బ్రహ్మరంధ్రం పగిలి ఉన్నది. చిరునవ్వుతో తేజస్సుతో ఆయన మోము వెలిగిపోతున్నది.

మరుసటి క్షణికంలో శివదేవయ్యమంత్రీ, రుద్రమాంబా విగతజీవుడై పడి ఉన్న చక్రవర్తికడకు ఉరికారు. చక్రవర్తి వెనుకనే నిలుచుండిఉన్న రాణులు నారాంబా పేరాంబలు ఇద్దరూ కూలిపోయారు. గుమ్మం దగ్గర ఉన్న ప్రసాదాదిత్య ప్రభువు వచ్చినాడు.

రాజవైద్యులైన చెన్నాప్రగడ గణపామాత్యుని తమ్ముడు చెన్నాప్రగడ సుబ్రహ్మణ్యమంత్రికి వార్త వెళ్ళగానే వారు వచ్చి చూచి ప్రాణము లేదని ధృవపరిచారు.

శివదేవయ్యమంత్రి ప్రసాదాదిత్యునకు ‘నగరము జాగ్రత్త’ అని ఆజ్ఞ ఇచ్చి పంపి, తలవరి మేచ నాయకుని ‘రక్షణ జాగ్రత్త!’ అనీ, పణీకము బాప్పదేవునికి ‘సైన్యాలు జాగ్రత్త’ అనీ హెచ్చరికలు పంపినారు. తంత్రపాలుడు పోలరౌతు నగరపు వెలివాడలకు సైన్యసమేతుడయి వెడలెను.

వేగుదళాధిపతి గొంకప్రభువు శివదేవయ్యమంత్రి ఆజ్ఞలను గొని మల్యాల గుండయమహా రాజుకు, మల్యాల చౌండసేనాపతికి, రేచెర్ల గణనాథ ప్రభువుకు, కోట భేతమహారాజుకు, చాళుక్య ఇందుశేఖర మహారాజుకు, కోనభీమ జనవల్లభ నృపాలునికి, జన్నిగదేవ సాహిణికి, అద్దంకి సారంగపాణిదేవ మహారాజుకు, సప్తమ చక్రవర్తి లింగైక్యమందినారనిన్నీ, అందుకు సర్వసేనలతో సిద్ధంగా ఉండాలనిన్నీ, ఏ సామంతులు తిరుగుబాటుచేసినా, ఏ పరరాజులు ఎత్తివచ్చినా వారిని నాశనంచేయడానికి సిద్ధంగా ఉండవలసిందనిన్నీ వేగులు పంపినారు.

అన్నాంబిక రుద్రమదేవి ప్రక్కనేవాలి, ఆమెను గట్టిగా హృదయానికి అదుముకొన్నది. రుద్రమదేవి తండ్రిశవము ప్రక్క మోకరించి కన్నులు మూసికొని కొయ్యబారిపోయెను.