పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నార్వురు ఊర్ధ్వలోకములలో ఒక గణముగా నుండి లోకహితము కొరకు భూమియందు జన్మించియుందురు. ఈ లోకముననేకాక భువర్లోకములందు ఎందఱో ఋషులు ఉన్నారు. వారికి బ్రహ్మ యజ్ఞమున ప్రతిదినము తర్పణము చేయుచున్నాము. అందు "సర్వాన్ ఋషీగ్‌ం స్తర్పయామి" అని "సర్వాన్ ఋషి గణాగ్‌ం స్తర్పయామి" అని కూడ ఉన్నది. దీనిని బట్టి కొందరు ఋషులు వ్యక్తులుగా ప్రముఖులైయుండగా మఱికొందఱు గణములుగా కూడియుందురని వ్యక్తమగుచున్నది. కావున భద్రకుడు మొదలుగా పదునార్వురు ఒక ఋషిగణమై యుండవచ్చును. వీరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను ఉపాసించి ఆ దేవతల యంశలతో అవతరించిరని, గణకుడు గణపతి నుపాసించి గణపతిశాస్త్రిగా అవతరింపగా స్థూల శిరస్సు కార్తికేయుని ఆరాధించి ఆ దేవుని యంశతో అవతరించెనని గ్రహింపవచ్చును. స్థూలశిరస్సు యీ గణమునకు నాయకుడై యుండును. కావుననే రమణునియందు స్థూల శిరస్సు గోచరించినంతనే, నాయన, తన్ను ఆయనకు అనుచరుడైన గణకునిగా స్మరించి, రమణుని మహర్షిగా, భగవానునిగా పేర్కొనియుండును. ఈ గణములో భద్రకాదులు కొలదిమంది మాత్రమే నాయన చరిత్రయందు ప్రస్తావింపబడినారు. తక్కినవారు ఎక్కడ ఏ విధముగా జన్మించి ఏయే కార్యముల నిర్వహించిరో నాయన చెప్పలేదు. భద్రకుడు కల్నల్ ఆల్కాట్‌గా రేణుకాదేవి అనిబిసెంటుగా ప్రస్తావింపబడుటచే ఈ ఋషులలో కొందఱు పాశ్చాత్యదేశములలోకూడ ప్రారబ్దకార్యలబ్ధికై జన్మించి యుందురని యూహింపవలసియున్నది.