పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నకు వచ్చి ఆ ప్రాంతమున విప్లవము నారంభించుటకు కావ్యకంఠుని యాశీస్సులను అర్థించెను. ఆయన దొరస్వామిని మందలించి విద్యార్థులు నాయకుల ప్రచారమునకు లోనై తమ విద్యాభ్యాసమును వదలు కొనుటగాని, జీవితములను అపాయముల పాలొనర్చుటగాని మూర్ఖత్వమని, విప్లవనాయకులు తమ స్వార్థమునకు విద్యార్థుల జీవితములను బలిగొనుట తప్పు అని పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని యధ్యక్షతయందు జరిగిన సభలో హెచ్చరించెను. తరువాత కొందఱు విద్యార్థులు ఆయన యొద్దకు వచ్చి దేశ స్వాతంత్ర్యము కొఱకు మంత్రశక్తితో ఉద్యమమును నడుపగల యొక సంఘమును స్థాపింపుడని కోరిరి. అప్పుడు ఆయన బ్రాహ్మణ విద్యార్థులతో ఇంద్రసంఘమును స్థాపించి, అది వేద మతోద్ధరణమునకు కృషిచేయవలయునని "ఉమాం వందేమాతరమ్" అను నొక మంత్రమును కల్పించి వారికి ఉపదేశించెను. ఆయన విద్యార్థులను రెచ్చగొట్టి ప్రభుత్వముపై విప్లవము జరుగునట్లు చేయుచున్నాడని కొందఱు ప్రభుత్వమునకు ఫిర్యాదులను చేసిరి. కాని యధికారులు విచారించి ఈ యపవాదులను త్రోసివేసిరి.

17 - 2 - 1907 తేది రాత్రి వేకువజామున కావ్యకంఠునకు భద్రకుడు కలలో కన్పించి "ఓయీ! నా దేహయాత్ర ముగిసినది. నీవు స్వయముగా జాగరూకుడవై యుండుము; ఇంక నీ తపస్సు చేత సంఘము తీవ్రముగా చలించును" అని యంతర్ధానము నొందెను. కావ్యకంఠుడు సోదరుడు పోయినట్లుగా దు:ఖించి స్నాన మొనర్చి వానికి తర్పణము గావించెను. తరువాత ఆ రాత్రియే మరణించిన దివ్యజ్ఞాన సమాజాధ్యక్షుడైన కల్నల్ ఆల్కాట్ దొరయే