పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముగ వదలి "అంతకు పూర్వమే సిద్దమైయున్న తన దివ్యామృతమయ శరీరమును వహించి యనామయ పదమును బొందెను."*[1]

గుంటూరు లక్ష్మికాంతము వర్ణించినట్లుగా నాయన 'నవయుగ యోగి చక్రవర్తి' అనుట యథార్థము. కపాలసిద్దితోపాటు ఆయన సాధించిన సిద్దులు అనేకములు. ఆయన చేసిన తపస్సు అసామాన్యము. శ్రీరామకృష్ణునకు వివేకానందునివలె శ్రీ రమణ భగవానునకు నాయన ప్రియతమ శిష్యుడై గురువు యొక్క కీర్తిని, సందేశమును దేశమున నలుమూలల వ్యాపింపజేసి గురు ఋణమును తీర్చుకొని చరితార్థు డయ్యెను.

శ్లో|| జయతు భరతక్షోణీఖండం విషాద వివర్జితం
    జయతు గణపస్తస్య క్షేమం విధాతుమనా ముని:
    జయతు రమణస్తస్యాచార్యో మహర్షి కులాచల:
    జయతు చ తయోర్మాతా పూతా మహేశ విలాసినీ||

భరతఖండము విషాద వివర్జితమై జయము నొందునుగాక. దానికి క్షేమము కలిగింపవలయునని తలంచుచున్న గణపతి జయము నొందునుగాక. అతనికి ఆచార్యుడును మహర్షి కులాచలుడును అయిన రమణుడు జయము నొందును గాక. వారి కిరువురకును తల్లియైన మహేశ విలాసిని ఉమాదేవి జయించుగాక.

||శుభమస్తు

  1. * నాయన పుట 728