పుట:Dvipada-Bagavathamu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

ద్విపదభాగవతము

తనరార మైందుని తమ్ముఁడ ద్వివిదుఁ
డనువాఁడ శూరుఁడ నర్కజు మంత్రి
రామునకై పూని రావణుతోడ
భీమాహవము సేసి పేర్చినవాఁడ
నెలకొన్న రణవీధిని ద్రుంచివైవఁ
గెలసి నాచెలికాని కెలసంబుఁ దీర్తు.”240
అనిపల్కియార్చి మహాశూలమెత్తి
కొని వైచుటయు సీరి క్రుంకి మైఁదప్పి
ముసలంబుఁగొని బెట్టు మోదిన వాఁడు
వెస మహాతరువెత్తి వేసి యార్చుటయుఁ
దప్పించుకొని సీరి తరుచరుమీఁద
గుప్పించి యుఱికి ముక్కున ముష్టిఁ బొడువ
తెరలక వానరాధిపుఁ డొక్క పెట్టు
తరుణులు బెగ్గిలఁ దరువృష్టిఁ గురిసె
లాంగూలమున వ్రేసి లలి నఖాగ్రమున
నంగంబుఁ జీరి మేనందంద కఱచి
పిడికిటఁ బొడిచినఁ బెనుమూర్ఛ నొంది
పడిలేచి యాబలభద్రుఁ డాతనిని
గళమున జిక్క నాగలి దగిలించి
యలుకమై రోఁకట నందంద పొడువ
హనువులు పగిలి మైయదటెల్లఁ బొలిసి
కనుమూసి నెత్తురు గ్రక్కిరోఁజుచును
బవిదాఁకి కూలిన పర్వతంబనఁగఁ
బ్లవగేంద్రుఁ డిలఁగూలి ప్రాణంబు విడిచె.
ఉవిదలందఱు వెఱఁగంది కీర్తింప