పుట:DivyaDesaPrakasika.djvu/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14. తిరుక్కుడందై 14

కుంభకోణము

శ్లో. శ్రీ హేమాంబుజినీ తటీ తు నగరే శ్రీ కుంభఘోణాభిదే
   ప్రాప్త:కోమల వల్లికాఖ్య మహిషీం శ్రీవైదికా గారగ:|
   హేమాఖ్యాన మునీక్షితో విజయతే శ్రీ శార్జ్గా పాణి ప్రభు:
   ప్రాగాస్యో భుజగేంధ్ర భోగశయనోతృప్తామృతాఖ్యాయుత:||


శ్లో. శ్రీ భూత మహదాఖ్యాన భక్తి సార శఠారిభి:|
   విష్ణుచిత్త కలిఘ్నాఖ్యాం గోదాస్తుతి పరిష్కృత:||


వివ: శార్జ్గ పాణి పెరుమాళ్-ఆరావముదు పెరుమాళ్-కోమలవల్లి తాయార్-హేమపుష్కరిణి-వైదిక విమానము-తూర్పు ముఖము-భుజంగ శయనమున ఉత్థాన శయనము పూదత్తాళ్వార్;పేయాళ్వార్; తిరుమழிశై ఆళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్-తిరుమంగై యాళ్వార్ కీర్తించినది. హేమమహర్షికి ప్రత్యక్షము.


విశే: ఈ దివ్యదేశమున ఈ సన్నిధి కాక చక్రపాణి పెరుమాళ్ సన్నిధి; రామర్, వరాహనాయనార్ సన్నిధులు గలవు. బ్రహ్మాలయము, సూర్యాలయము కలవు. తిరుమழிశై ఆళ్వార్ తిరునాడు అలంకరించిన (పరమ పదించిన) స్థలము. శార్జ్గ పాణి పెరుమాళ్ సన్నిధికి పడమట వీరికి సన్నిధి గలదు. మకరం-మేషమాసములలో బ్రహ్మోత్సవము జరుగును.


ఈ క్షేత్రమునకు కుడమూక్కు (కుంభ ఘోణం) అను విలక్షణమైన తిరునామము కలదు. నమ్మాళ్వారు తిరువాయిమొழிలో "ఆరావము"తే యను దశకమున (5-8) ఆరావముతే (ఆతృప్తామృతమా! అనగా ఎంత సేవించినను అనుభవించినను తనివి తీరక ఇంకను అనుభవింపవలెనను కోరిక కలుగునట్లు వేంచేసియున్నవాడా!) అని కీర్తించియున్నారు. అంతియేకాక "శూழ்విశుమ్" అను తిరువాయిమొழிలో (10-9) తమ పరమ పదానుభవమును ప్రకటించుచు భూలోకస్మరణ ప్రసక్తియే లేని సందర్భమున కూడ "కుడన్దై యెజ్గోవలన్" అని కుంభఘోణక్షేత్రమును కీర్తించిరి. అట్లే తిరుమజ్గై యాళ్వారును తమ ప్రబంధములలో మొదటిదగు పెరియ తిరుమొழி ప్రారంభములో "ఆవియే యముదే" అనుపాశురమున (పె.తి.1-1-2) శూழ்పునల్ కుడన్దైయే తొழுదు" (జలాశయ పరివృతమైన కుంభఘోణక్షేత్రమునే సేవించి) యని మొట్ట మొదట కుంభఘోణక్షేత్రమునే ప్రస్తుతించిరి. అంతియే కాక తమ ప్రబంధములలో చివరిదగు "తిరునెడున్దాణ్డగ"మున "తణ్కుడన్దక్కిడన్దమాలై" యని ఈ క్షేత్రమునే ప్రస్తుతించి ముగించిరి.