పుట:Dashavathara-Charitramu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లేనవ్వుతో స్వామి హర్యక్ష మోవత్స ని న్గాంచుటం జేసి నీతండ్రి ముయ్యేడు
వంశంబులంగూడి శుద్ధాత్ముఁ డయ్యె న్విచిత్రంబె నీవంటినాభక్తు లేదేశమం దుం
దురో యట్టిదేశంబులందున్న పాపాత్ములుం జాలపుణ్యాత్ములై యాయురారోగ్య
సౌభాగ్యభాగ్యంబులుం గల్గి వర్తింతురంచుం బ్రసన్నాత్ముఁడై యిందిరాకాంత
నంకంబుపై నుంచి లక్ష్మీనృసింహాఖ్యచే భక్తులం బూర్ణకారుణ్యదృష్టిం గటాక్షించి
రక్షించుచు న్మించె నెల్లప్పుడున్.

236


వ.

అంత.

237


శా.

ఆదిత్యు ల్సుమవర్షము ల్గురియఁ దూర్యారావము ల్మీఱ భృ
గ్వాదు ల్మంత్రము లుచ్చరింప మణిపీఠారూడుఁ గావించి ర
క్షాదక్షుండని దైత్యదానవమహాసామ్రాజ్య మేలంగఁ బ్ర
హ్లాదుం బట్టము గట్టె బ్రహ్మ జగదాహ్లాదంబు సంధిల్లఁగన్.

238


క.

ధరణీశ్వర వినిపించితి, నరహరిచరితంబు పావనం బిది నరులె
వ్వరు విన్న వా రికొదవు, న్హరిభక్తి [1]చిరాయురీహితైశ్వర్యంబుల్.

239


క.

అని శ్రీవైశంపాయన, మునిముఖ్యులు దెల్ప విని ప్రమోదాన్వితుఁ డై
జనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెల్పు మని యడుగుటయున్.

240


శా.

ఆత్మానాత్మవిచారచారుతరమేధాధారధారాధరై
కాత్మత్వప్రతిపాదనప్రవణదానా సారసారంగవా
హాత్మంబర్యధినాథ నిర్మలతరవ్యాహార హారస్థగా
రుత్మద్రత్న విభా నిదర్శిత హృదారూఢాచ్యుతాంగప్రభా.

241


క.

కవిరాజరాజకృతకృతి, కవిరాజవిరాజతనుత ఖలపథికపురః
కవిరాజరాజసమధని, కవిరాజవిరాజితాస్య కమనీయయశా.

242


పృథ్వి.

ఫణాధరపణా స్ఫురద్బహుచిరత్న రత్నప్రభా
రుణారుణవిదారణారుణభుజా మహోభీషణా
రణాంగణభయానక క్రమజయానక ప్రస్ఫుటా
ధణాధణధణార్భటీదళిత చిత్తవిద్వేషణా.

243


గద్య.

ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాఫతలదీప్తతరాష్ట
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగ
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం
బైనదశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము.

4. నరసింహావతారకథ సమాప్తము.

  1. చిరాయు సుమహితైశ్వర్యంబుల్