పుట:Dashavathara-Charitramu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

దితిజాధీశకుమారశేఖరుఁడు మధ్యేవారిధిం గ్రుంకి యం
దతిశక్తిం బొరలంగ వారినిధి వేలాతీతకల్లోలసం
హతుల న్భూతలమెల్ల నిండిన నిశాటాధ్యక్షుఁ డుద్భ్రాంతుఁడై
యతివేగంబున భృత్యులం బిలిచి సాహంకారుఁ డై యిట్లనున్.

228


సీ.

తపియింపఁ బోయి తాఁ దపియించె శుచి శోష సేయఁగఁ బూని శోషించె గాడ్పు
భేదించు శస్త్రముల్ భిన్నంబులయ్యెను జిలువలు గఱువ దంష్టికలు విఱిగెఁ
బొడిచిన దిగ్గజంబుల దంతములు వ్రీలె మాయలన్నియు మటుమాయలయ్యెఁ
గుక్షిఁ జొచ్చిన కాలకూటంబు జీర్ణించిఁ గృత్తికృత్యంబు లకృత్యమయ్యెఁ


తే.

గాన వీనికి నెందును హానిలేదు, జలధిమధ్యంబులో వైచి శైలతతులు
బైనిఁ గట్టింపుఁ డాక్రిందఁబడి సహస్ర, వర్షములకైనఁ బ్రాణముల్ వదలు జడుఁడు.

229


క.

అని పంప భటులు ప్రహ్లాదుని జలధి న్వైచి పైని దోడ్తో వెయియో
జనములపట్టు మహాహా, ర్యనికాయంబులను గట్టి యరిగిన పిదపన్.

230


సీ.

పరుషపన్నగపాశబద్ధుఁడై పాథోధిఁ బడియును దైతేయబాలకుండు
మధ్యాహ్నవేళ నిర్మలమనోద్ఘాతుఁడై విశ్వప్రపంచంబు విష్ణుఁ డనుచు
భావింప నామరూపంబులు నశియించి చిన్మాత్ర మగుచుఁ దోఁచినను దాను
నైక్యమై “బ్రహ్మాహ” మనుబుద్ధి సిద్ధింప నానందవార్ధి నోలాడుచున్నఁ


తే.

దనకుఁ దా వీడె నాగబంధములు వారి, రాశి శోషింపఁ గదలె ధరాతలంబు
నంతఁ బ్రహ్లాదుఁ డుపరిబద్ధాద్రిచయము, నేల వడిఁ ద్రోచి వెలుపలి కేఁగుదెంచి.

231


క.

గగనాద్యుపలక్షణముల, జగముం గని భేదబుద్ధి జనియించినచో
నగి ప్రహ్లాదుఁడనా యని, జగతీశునిఁ బొగడికొనుచు జనకునిఁ జేరెన్.

232


చ.

కనుఁగొని విస్మయంబునను గశ్యపనందనుఁ డోరిదుర్మతీ
యనలములోన వైచితి మహావిష మిచ్చితి మాయవన్నితి
న్ఘనఫణిపాశబంధముల గంధిని ముంచితి నేమి సేసిన
న్మనియెద వింత ప్రోవఁగ రమాపతికైనను శక్తి గల్గునే.

233


వ.

అని రూక్షేక్షణంబుల నాక్షేపించు రక్షఃకులాధ్యక్షునకుఁ బుండరీకాక్షభక్తుం
డిట్లనియె.

234


సీ.

అతిఘోరతాపత్రయము మాన్పుఘనునకుఁ జిదుగుమంటలఁ జల్లఁజేయు టెంత
మృత్యుభయంబు వారించువైద్యున కహిప్రముఖాపమృత్యువు ల్బావు టెంత
యఖిలప్రపంచమాయ నడంచుమాయావి కిల దైత్యమాయ మాయించు టెంత
విస్తారసంసారవిషరాశి దాఁటించు ధీరునకును వార్ధిఁ దేల్చు టెంత


తే.

యేల యజ్ఞాన మొదవె దైత్యేంద్ర నీకు, విష్ణుచేఁ గానిపను లెల్ల విశ్వమునను
గాన నద్దేవుఁ గొల్చి మోక్షంబుఁ గాంచు, మైహికము తుచ్ఛ మంచుఁ బ్రహ్లాదుఁ డనిన,

235