పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నేను ఉదాహరించిన శ్లోకాలేవీ, ఆలోచించి వెదకి వుదాహరించినవి కావు. యెక్కడపట్టినా ధార అనర్గళంగానే నాబుద్ధికి కనపడుతూ ఉంది. అందుచేత గ్రంథమంతా నాకుధారాశుద్ధికి వుదాహరణంగానే కనపడుతూవుంది. యిందు మిక్కిలీ సులభంగా వేదాంతబోధ సాధించఁబడింది. హరి హర వైషమ్యము లేకుండా కథావస్తువు కల్పింపఁబడింది. తెలుఁగుపత్రికలో యింతకన్న శ్లోకాలు వుదాహరిస్తే వ్యాసము చేదస్తపు తరగతిలోనికి చేరవలసివస్తుంది. అయితే యీనాటకంలో శాబ్దికదోషాలేమీ లేనేలేవా? అని పురోభాగులు ప్రశ్నిస్తారేమో? వున్నాయి. లేకపోలేదు. కాని అవి అచ్చుపొరపాట్లున్నూ కావు. గ్రంథకర్తగారి వ్రాతలోనే ఆపొరపాట్లు పడివున్నాయి. ప్రాచీన పండితులందఱున్నూ వ్రాయడం అలాగే వ్రాస్తారు. యీ అంశం తాటాకు గ్రంథాలు పరిశీలిస్తే స్పష్టపడుతుంది. దాన్నివారి పాండిత్యలోపం క్రింద పరిగణించుకోవడం ప్రాజ్ఞ లక్షణంకాదని నా తలంపు. మాముత్తాతగారి స్వదస్తూరి పుస్తకాలలో వారి పేరు నృసింహశాస్త్రుల్లు అనే వ్రాయఁబడివుంది. అంతమాత్రంచేత ఆయనకు సింహశబ్దవ్యుత్పత్తి తెలియదని యెట్లనుకునేది? యిట్టివితప్ప పనిపడితే నిల్వతగ్గవి కనపడలేదు. ఒక్కటికాఁబోలు నాకు ప్రష్టవ్యంగా కనపడింది. తీరా దాన్ని బయటపెడితే “ఫణిపయితాహే - కణపయితాహే" అన్న మాదిరిగా యేంజవాబు వస్తుందో అని భయపడి వూరుకున్నానని విజ్ఞులకు విన్నవించుకుంటాను. మఱిన్నీ వీరియింటిపేరే కొంచెం మార్పుతో మఱివకటివుంది. అది శిష్ట్లా, యింకొకటివుంది, అది శిష్టు, ప్రస్తుతం మనంమాట్లాడుకున్నది శిష్టావారినిగూర్చి శిష్టువారినిగూర్చి యింకొకసారి వ్రాస్తాను. ఆవ్రాసేటప్పడే తాటితో దబ్బనంగా పిండుప్రోలు వారున్నూ వస్తారు. మాప్రాంతంలో వీఱిద్దఱికీ సంబంధించిన కథలు చాలా వున్నాయి. కొన్నిటిని శ్రీగురజాడ రామమూర్తి పంతులుగారు కవిజీవితములు అనే చరిత్రగ్రంథంలో యెత్తుకున్నారు. ఇంకాకొన్ని పల్లెటూళ్లల్లో పెద్దలవల్ల నేను విన్నవున్నాయి. మఱొకప్పుడు వ్రాస్తాను. ప్రస్తుతం శిష్టావారికి నమస్కరిస్తూ దీన్ని ఆపుతున్నాను.


★ ★ ★