పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదకవులు

241


చాలమంది "గేయం గేయస్యలక్షణమ్”గా రచన సాఁగిస్తారు. యిది నా అనుభవాన్నిబట్టి వ్రాసే వ్రాత. నేను యేవిధమైన లక్షణమూ యెరక్కుండానే యేవో గేయాలు చిన్నప్పుడు వ్రాసేవాణ్ణి యిటీవల వాట్లను పరిశీలిస్తే లక్షణానికి సరిపడే వుండేవి. “ఉపచారము చేసేవారున్నారని మఱవకు రామ|| ఉప|| “రామ నీసమాన మెవరు; రఘువంశోద్దారకా॥ రామ||"

యీకీర్తనలు త్యాగరాయలవి. వీట్లలో యే అక్షరానికి ఆ అక్షరమే యతిస్థానంలో పడింది. దీన్నే యేకతర యతి అని అన్నాను నేను; (అప్ప కవి రేఫకు రేఫ యతి చెల్లితేనే యేకతర యతి అన్నాఁడు ఇతరం కూడా కావచ్చునని నేననుకుంటాను) వర్గయతికంటే కూడా పదకవులు దీన్నే యెక్కువగా వాడతారు. అంతేనేకాని యేదోవిధంగా యతి సరిపెట్టే రచన, అంటే :-

శా. కేదారేశు భజించితిన్ శిరమునన్ గీలించితిన్ హింగుళా
    పాదాంభోజములన్ బ్రయాగనిలయున్ బద్మాక్షు సేవించితిన్
    యాదోనాథసుతా కళత్రు బదరీనారాయణున్-

అనేమాదిరిని శాస్త్రరీత్యా సరివడిన్నీ అనుభవానికి సరిపోని యతులు యెన్ని వేలకీర్తనలు వెతికినా దొరకనే దొరకవని సప్రతిజ్ఞంగా చెప్పొచ్చును. దీన్నిబట్టి చూస్తే తెలుఁగుభాషతోపాటు- “తాటితో దబ్బనంగా” పుట్టిన యతిప్రాసలనే సహజాలంకారాన్ని వదలకుండా ధరిస్తూవున్నది పదకవిత్వమేగాని పద్యకవిత్వం కానేకాదంటే తప్పేమి? పద్యకవిత్వం కంటే కూడా ముందుగా పదకవిత్వమే పుట్టిందేమో? అని నేననుకుంటాను. కాని దీనికీ నీకేమిటాధారమంటే తగినంత తృప్తికరమైన జవాబు చెప్పడం కష్టం. కవిత్వం సంస్కృతంలో చెప్పినా కవి తెలుఁగుదేశస్థుఁడైతే అందులో యతిప్రాసలు వుండడం కూడా అనుభూతంగా కనపడుతూ వుంది. తరంగాలు చూచుకుంటే యీ విషయం బోధపడుతుంది.

1. ఏహి ముదందేహి శ్రీకృష్ణ! కృష్ణ! మాం -
   పాహి గోపాల బాలకృష్ణ! కృష్ణ! ||ఏహి ||

2. రామకృష్ణ గోవిందేతి నామసంప్రయోగే॥
3. స్వజనాదయాధృత దేహతయా
   విహరంత మమర మిహ భూతలే
   ప్రజభువి రాససమయరసపండిత
   గోపవధూకృతమండలే || పరమిహ॥