పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

232

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


“ధీరసమీరే, యమునాతీరే, వసతి వనే వనమాలీ"

దీన్ని పూర్వం మన దేశంలో రేగుప్తిరాగంలో పాడేవారు. ఆపాడడం భాగోతపుకత్తుగా వుండేది. ఇప్పుడు యేదో రాగంమీఁద ఆతాళం మీఁదే పాడినది ప్లేట్లలో వింటే దానికిన్నీ దీనికిన్నీ సహస్రాంతం వారకనపడుతూ వుంది. దీన్నిబట్టి పదకవిత్వానికి గానంవల్ల యెక్కువ సారస్యం కలుగుతుందని వొప్పుకోక తప్పదుగాని అసలు సరుకు మంచిదికాకపోతే కేవలగానం యేంపనిచేస్తుంది? అసలు వంకాయలు గిజరు వంకాయలయితే వంట బ్రాహ్మఁడెంత ఆఱితేఱినవాఁడయితే మాత్రం ప్రయోజన మేముంటుంది? కాని ఆలా తోసివేయడానికిన్నీవీలుకాదు. యేమంటారా? “తుమ్మచెట్టుమీఁద కాకి వాలింది తుపాకిదేరా కొడదాము” అనే గేయంలో యేం రసముంది? లేకపోయినా శ్రుతిలయలతో మేళగించి యేదో రాగం మీఁద పాడితే యెంతో హాయిగా వుండడమున్నూ అనుభూతమే. "తత్తదిమిత దిద్ది యని సదా, శివుఁడాడినాఁడె" అనే పల్లవిలో కవిత్వపు మాధుర్యం యేమి వుంది? వుండకపోయినా గాయకులు లోకాతీతంగా పాడి మెప్పిస్తారు. అంతమాత్రంచేత గేయకవిత్వంలో రసం వుండనేవుండనక్కఱ లేదనిన్నీ శ్రుతిలయలే ఆభారాన్నంతనీ వహిస్తాయనిన్నీ అనుకోవడం యుక్తంకాదు. 1) గీతగోవిందం, 2) తరంగాలు, 3) అధ్యాత్మరామాయణకీర్తనలు, 4) ప్రహ్లాదనాటకం, 5) రామనాటకం యివి కొంత ప్రాచీనాలు. గరుడాచలనాటకం వగయిరాలు కొన్ని నవీనాలున్నూ వున్నాయి. వీట్లలో అధ్యాత్మరామాయణకీర్తనలు రచించిన కవి కవిత్వం తెలుఁగులో ఉత్తమస్థానాన్ని అలంకరిస్తుంది.

రేగుప్తి - అట

ఈ సంశయము వారింపవే! జగదీశ! నన్ను
మన్నింపవే! భాసమానవిలాస! నేనిదె
నీ సత్కృపావలోకనమున, నీ సమయమునఁ
దెలియవలసినదే సమస్తమిదే ప్రశస్తము ||ఈసం||

తెలుఁగులో పద్యకవిత్వానికి భారతాని కున్నంత గౌరవమున్నూ, పదకవిత్వంలో ఆధ్యాత్మ కీర్తనలకు వుందంటే కాదని యే విజ్ఞులున్నూ అనరు. అంత్యనియమాదులతో మంచి లయపిక్కట్టుగావుండే యీ కీర్తనలు వేదంలాగు గురుముఖతః చెప్పుకొనిపాడేవారు నా చిన్నతనంనాటికి కొందఱు వుండేవారు 1) ఉప్మాక బ్రహ్మన్నగారు 2) ముక్కామల జోగయ్య గారు 3) చక్రవర్తుల చిట్టెయ్యగారు వగయిరాలు. కాని ఆ సంప్రదాయంగా పాడేవారు యిప్పుడు క్రమంగా అంతరించినట్లు కనపడుతుంది.