పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

231



పదకవులు

అనఁగా గేయాలు రచించిన కవులు. వీరిలో మిక్కిలి రసవంతమైన వాక్కు కలవారు కనపడతారు. కాని ఆ రసం తెలుసుకోవలసివస్తే కొంత సామగ్రీ సహాయంతో చక్కఁగా పాడేవ్యక్తి పాడినప్పుడే అవగతమవుతుందిగాని యెవరు పడితేవారు దాన్ని పద్యాలలాగా చదివితే అవగతం కాదు. (పద్యమేనా గాత్రమాధుర్యం బొత్తిగా లేని వారు చదివితే పదడయి పోతుందిగాని యేమేనా దీనిలాగ పదడుకాదు) దాన్నిబట్టి ఆ రసం సంగీతానికి సంబంధించిందే కాని అసలు దానికి సంబంధించింది కాదని కవులు పదకవిత్వాన్ని యీసడించారని తోస్తుంది. యీసడించడంలోనున్నూ యింతా అంతా కాదు. శ్రీనాథుఁడు యేలా యీసడించాడో చూడండి.

క. ముదివిటులు విధవలంజలు - పదకవితలు మాఱుబాసబాపనివారల్
   చదువని విద్వద్వర్యులు - కదనార్భటవీరవరులు కడిదిపురమునన్.

యీ పద్యంలో నాలుగోచరణానికి అర్థం నాకిప్పటికీ తెలియనే లేదు. (యేదేనా పాఠాంతరం వుందేమో తెలియదు) గాని మొత్తం యేదో దురర్ధం చెప్పక తప్పదని మాత్రం ప్రకరణాన్నిబట్టి తెలుసుకున్నాను. యెందఱో మహనీయులు పదకవులలో కనపడుతూవున్నా శ్రీనాథుఁడంతవాఁడు యింత నికృష్టంగా యీసడించడాని క్కారణం గోచరించడమేలేదు. పద్యకవిత్వం కూడా శ్రుతితాళ సమన్వితంగా కుశలవులు పాడి శ్రీరామచంద్రుని మెప్పును పొందినట్టుగా పండితులు పరంపరగా చెప్పుకోవడం సర్వులూ యెఱిఁగిందే. పద్యకవిత్వానికి మొట్టమొదటి కవిత్వం వాల్మీకిరామాయణానికే కీర్తనలవలె పాడడంవల్ల గౌరవం కల్గినప్పుడు అసలు రాగతాళ సంబంధంగా రచియించినదాన్ని శ్రీనాథుఁడు యెందుకు యీసడించవలసి వచ్చిందో! అని నాకు సందేహం కలుగుతూ వుంది. పోనీ యీ పదకవిత్వాన్ని యే పామరులో తప్ప పండిత కవులు ఆదరించలేదేమో అనుకుంటే జయదేవుఁడు గీతగోవిందాన్ని రచించి యెంతో యశస్సును పొందివున్నాఁడు. గీతగోవిందంలో అక్కడక్కడ లయతో అవసరంలేని శ్లోకాలున్నూ వున్నప్పటికీ ప్రాధాన్యం కీర్తనలకే కనపడుతుంది. మనదేశంలో యీ గీతగోవిందాన్ని సక్రమంగా పాడేవారు లేరు. ఉత్తరదేశంలో వున్నట్టు వినడం. ఇప్పుడిప్పుడు ఆ దేశస్థులవల్ల విని మన దేశస్థులు కూడా కొన్నిటిని పాడుతూ వుంటే యెంతో హాయిగా గ్రామఫోను ప్లేట్లల్లో వింటున్నాము.