పుట:Bobbili yuddam natakam.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాంకము.

[రాణి పురోహితభార్య వేంకటలక్ష్మి వేగుయువతులును

ప్రవేశింతురు.]

రాణి. - [పురోహితభార్యను నిర్దేశించి] అవ్వగారూ ఈదాసీయువతులను ఇరువురను బయటివృత్తాంతములు తెచ్చుటకై పంపుచున్నాను. [అని వారింగని] ఓధన్యురాండ్రారా మీరు పోయి మీయన్నదమ్ములద్వారాన రాజువిడిదలలోని వృత్తాంతములం దెలిసికొనివచ్చి నివేదింపుఁడు.

వేగుయువతులు. - మమ్మేలిన తల్లిగారి చిత్తము. [అని నిష్క్రమింతురు.

రాణి. - అవ్వా, అరుంఢతీదేవిగారూ. తాతగా రేమయిన మాకు ఈయిడుమ తప్పు నని చెప్పినారా?

పురో-భా. - ఏమిచెప్పుదును తల్లీ, మీపురోహితులవారికి నాతో పలుకుటకు తీఱలేదు. నిరంతరము శాంతిక పౌష్టికములకు జతనములు చేయుటగా నున్నారు.

రాణి. - వారి యాశీర్వచనము లైన ఇపుడు ఫలింపరాదా?

వేగుయువతులు. - [ప్రవేశించి] దండం దండం మమ్మేలిన తల్లిగారికి.

రాణి. - బాలికలారా, ఏదేని చల్లనివార్త తెచ్చితిరా ?

వేగు. - చల్లనివార్త లెక్కడివి ! మాతల్లీ, ఆపాపాత్ముడి హృదయం ఏమిచెప్పుదుము మమ్మేలినదేవీ ?

రాణి. - వివరముగా చెప్పుఁడు.

వేగు. - ఆరాజు తనకూ మన దొరగారికీ వున్నపగలు బొబ్బరిస్తావున్నా డంట బొబ్బిలికోట దున్నించి, పొగాకుతోట వేయిస్తాడంట. ఆ పాటిపొగాకు పుచ్చుకోక తనపగలు తీరవంట. రాయనింగారి శిరస్సు గోసుకొని పోతాడంట. తనయన్న కుమారుడికి ఆనందరాజుకి బొబ్బిలికోట పట్టం కడతా డంట. ఈలాగ గర్జించి ఇంకను పాడుమాటలు పలికినాడంట తల్లీ.

రాణి. - వానిని గూడ వినిపింపుఁడు. ఇప్పుడు మాకాలము అట్టిది.

వేగు. - మఱి రంగారాయనింగారి బంగారపు మంచముపై పరుంటేనేగాని, తన పగలు తీర వని అరుస్తావున్నాడంట.