పుట:Bobbili yuddam natakam.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాంకము

25

         శా. ఊరేఁగింపుని కొన్ని యెట్టెదుట నచ్ఛోచ్చాంబ రాదర్శ బిం
              బారూఢంబులొ, యుత్స వేక్షణముకై నాకంబె యేతెంచెనో,
              నా, రంభోర్వసులన్ మహేంద్రసభ మందారంబు నింద్రాశ్వమున్
              భూరిక్ష్మాధ్రము నింద్రసింధురముఁ జూపున్ బాణసంచా యిటన్.
                  
                   మఱియు, -

         ఉ. బంగరువన్నె పాము లురువర్ష్మము లుర్వరనుండి లేచి, త
              త్సంగముఁ బాయ కే దివికిఁ జాఁగి, దిశాతతి మూయ, వాని దీ
              ర్ఘాంగము లడ్డుగాఁ గడుపులం దుఱు రేకులుఁ బడ్గు పేక యై
              బంగరుగాదెలో నడుగుఁబట్టినకైవడిఁ బ్రోలు గ్రా లెడిన్. ౨౪

రాణి. - సరసురాలవే వేంకటలక్ష్మీ. గద్యరూపమున నించుక మాకు శ్రవణముల నమృతముం గురియింపుము.

వేంకట. - మహాలక్ష్మియాజ్ఞ. - చదలం దేలియాడు నీ దీపపుగుమ్మ టములు కాగితంపులోనివలనం గల చిత్తరువులు బయలికి వెలుంగుచుండ, ఉత్సవ దిదృక్షు సౌవర మిథునాధిష్ఠిత విమానంబుల చందంబున నందగించుచున్నవి. సమలంకృతంబులును ఉపరి విస్తీర్ణోభయపార్శ్వలంబమాన రత్నకంబళ విరాజితంబులును వరాద్యధిష్ఠితంబులు నైన యీయేనుంగులు ఈవీథిపొడుగున మి న్నంటుచు నూరేఁగింపు నడచునొప్పిదము - మహా గిరులు సపక్షంబులు శ్రీరాయనింగారి ప్రాపున ఇంద్రుని సరకుసేయక సిద్ధవిద్యాధరాద్యధిష్టితంబులై జ్యోతిష్మత్యాది దేదీప్యమానంబులై యథేచ్చసంచార భాగ్యంబు ననుభవించుటయో నాఁ-గన్పట్టుచున్నది. [నేపథ్యమును బరికించి] మహాలక్ష్మీ, ఊరేఁగింపు మన నగరిదర్వాజాకడకే వచ్చి నిలిచియున్నది ; మేజువాణి జరుగుచున్నది.

పెండ్లికొమారితలు. - వేంకటలక్ష్మి, ఆమేజువాణిలోని పాట మాకు తెల్లము గాక యున్నది. దానిని నీవు యథోచితముగ అభినయ పూర్వకముగా ననువదించి మావీనులకు విందొనర్పుము.

వేంకట. - దొరసానులయాజ్ఞ. చిత్తగింపుడు - ఈ గేయము నాయకునిమ్రోల విరహిణీదూత్యుక్తి. [అని యిట్లు పాడును.]

[గేయము]

              బిత్తరి నీమీఁదఁ జిత్తమి డిన యాతత్తఱ ము వినరా !
                      నాసామి, ఆ తత్తఱ ....