15. హృదయ పరివర్తనం చెందాలి - మార్కు 1,15
దైవరాజ్యం సమిపించింది గనుక హృదయ పరివర్తనం చెందమని బోధించాడు ప్రభువ. ఇక్కడ దైవరాజ్యమంటే క్రీస్తే హృదయ పరివర్తనమంటే మన విలువలూ, తలపులూ చేతలూ మార్చుకోవాలి. క్రీస్తు విజయంచేస్తాడు గనుక ప్రజలు అతన్ని వెంబడించడానికి సంసిద్ధం కావాలి. కాని అతడు తన అనుచరుల నుండి కోరేది విశుద్ధవర్తనం. కనుక నరులు తమ పాపజీవితాన్ని మార్చుకోవాలి. మన పాపజీవితం రకరకాల రూపాల్లో వుండవచ్చు. మనంచేసే సాంఘిక అన్యాం గూడ ఓరకం పాపజీవితమై వుండవచ్చు. ఈ యన్యాయాన్ని సవరించుకొంటేనే గాని మనం దైవరాజ్యంలో ప్రవేశించలేం.
నిరుద్యోగంవల్ల బాధపడ్డమనేది మనదేశంలో ఓపెద్ద సమస్య ఒక అంచనా ప్రకారం పల్లెల్లో కూలిపని చేసికొని బ్రతికే పామర జనంలో 12 కోట్లమందికి పనీ పాటలు దొరకడం లేదు. పల్లెల్లోనైతేనేమి పట్టణాల్లోనైతేనేమి విద్యావంతులకు ఇరవైకోట్ల మందికి ఉద్యోగాలు దొరకడంలేదు. ఈలా ఉద్యోగాలూ పనిపాటలూ దొరకని జనమంతా ఏలా బ్రతుకుతున్నారో దేవుడికే యెరుక.
16. ఓదేవా ఈ పాపిని కరుణించు – లూకా 18, 13
ప్రార్ధనం చేసికోవడానికి ఇద్దరు దేవాలయానికి వెళ్లారు. వాళ్లల్లో ఒకడు పరిసయుడు. మరొకడు సుంకరి. పరిసయుడు "దేవా! నేను నీతిమంతుణ్ణని నీకు తెలుసుగదా!" అని దేవుని ముందు తన్ను తాను మెచ్చుకొన్నాడు. కాని సుంకరి "ప్రభో! నేను పాపిని, నన్నుకరుణించు" అని ప్రార్థించాడు. మనందరం సాంఘిక అన్యాయంలో పాల్గొంటూనే వుంటాం. అవకాశం లభించినపుడెల్ల మనకంటె క్రిందివాళ్ల నోళు కొడుతూనేవుంటాం. ఈ సంగతిని గుర్తించి మనం చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడాలి. ఆ సుంకరిలాగే మనంగూడ పాపులమని ఒప్పకోవాలి. అప్పుడు దేవుడు మనలను క్షమిస్తాడు. అంతేగాని ఆ పరిసయుడులాగ మనలను మనం నీతిమంతులనుగా ఎంచుకొని ఆత్మస్తుతి చేసికొంటూ కూర్చోగూడదు.
మనదేశంలో విద్యావంతులు 60 శాతం, అవిద్యావంతులు 40 శాతం. అనగా మన దేశీయులు 40 కోట్లమందికి అక్షరజ్ఞానం లేదు. చదువు సంధ్యల్లేక అజ్ఞానులై యున్న ప్రజలను వంచించడం సులభం. మనదేశంలో కొంతమంది మరికొంతమందిని నిత్యం వంచిస్తూంటారు. కాని ఈలా వంచితులయ్యేవాళ్లల్లో అధిక సంఖ్యాకులు పేదసాదలే వీళ్లు వంచితులై గూడ న్యాయంకోసం పోరాడలేరు.