పుట:Bhagira Loya.djvu/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'


6

మీనాక్షి రెండేళ్లు గురుకులవాసము చేసింది. వచ్చిన చదువు చాలునని యింతలో ఆమె తాత వీరయ్య గరుత్మంతుడులా వచ్చి మనుమరాల్ని తీసుకు చక్కాపోయాడు. ఆ బాలిక సీతారామయ్యగారి కడ సెలవు పుచ్చుకొని ఆయన పాదాలకు, ఆయన భార్య పాదాలకు నమస్కారం చేసి తల్లి దండ్రులను వదలి వెళ్ళే బిడ్డలా వెక్కివెక్కి యేడ్చినది.

ఆ దంపతుల ఇరువురికిన్నీ కళ్లు చెమర్చినవి. వీరయ్య మనుమరాలిచేత తాంబూలములో పదికాసులుపెట్టి ఇప్పించబోగా సీతారామయ్యగారు కోపగించుకొని వీరయ్యను తలవాచేటట్లు చీవాట్లుపెట్టినారు. "ఆమె నా కూతురు. అల్లాంటి అమ్మాయికి చదువు చెప్పడం నా అదృష్టం" అన్నారు. భార్యచేత మీనాక్షికి పసుపు, కుంకుమ, చీర, రవికలగుడ్డ యిప్పించారు.

కామేశ్వర్రావు హృదయం దడదడమని కొట్టుకొంటోంది. కుంగిపోతూ నిలబడినాడు. మీనాక్షి కోసం తెప్పించిన తొంబదిరూపాయల తంబూరాను ఆమెకిస్తూ "మీనాక్షి ! ఇక నన్ను మరిచిపో" అన్నాడు.

మీనాక్షి వెక్కివెక్కి యేడ్చింది. కామేశ్వర్రావును వదిలిపెట్టి వెళ్ళుట ఆమెకు అంతరాంతరాలల్లో మరీ కష్టమై తోచింది.

72