పుట:Bhagira Loya.djvu/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీపం సెమ్మా

ఆ రాగి సెమ్మా ఎన్ని శతాబ్దాల క్రితం చేశారో మా తాతయ్య కూడా చెప్పలేకపోయాడు. అయితేమాత్రం మా కుటుంబంలో ఆరు తరాల్నుంచీ దేవతార్చన పీఠం దగ్గిర ఆవు నెయ్యి వత్తులదీపం కాంతులు ఆనందంగా విరజిల్లుతూ వుండేది.

మా తాతయ్యే చిన్నతనంలో నన్ను కాళ్ల వుయ్యాల వూగిస్తూ, 'వుయ్యాలా దంపాలా' అని పాట పాడుతూ ఆ సెమ్మా కథ చెప్పాడు.

"చిట్టిగా అప్పుడే వయిందనుకున్నావు, మా తాతయ్య తాతయ్య తాతయ్య రామేశ్వరం నడిచి వెళ్తూ కుంభకోణంలో ఆగాడు."

"తాతయ్యా! కుంభకోణం మన చింతలదొడ్డి వెనకాలా? అక్కయ్య నువ్వు చెప్పావని చెప్పింది లే".

"కాదురా - ఇంకా దాని వెనక ఎంతో......దూరం. ఆ కుంభకోణంలో ఆయన సోమవారం వుదయమే కోనేరులో స్నానంచేసి, సంధ్యావందనం వార్చి, మడిబట్టలు, రాగి చెంబు, వుద్ధరిణెతో గోపురం దగ్గిరకు వెళ్లాడు."

117