కొనుటమాని ఆరోగ్యరుచులకై భోజనాదులలో వివిధభంగులేర్పఱుప నుద్యుక్తులై నందున అందఱు నొకేవృత్తి నాశ్రయించుటమాని భిన్నవ్యాపారతంత్రులైరి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మంగలి, చాకలి, బేహారి మొదలగు నానావిధములగు బ్రదుకుదెరువు లేర్పడుటచే నపూర్వసమృద్ధినొంది దేశంబు విలసిల్లె. సిరు లుల్లసిల్లుటచే జనులును సమంచిత విరామకాలంబును విద్యావిభూతియుంజెంది సుఖపరాయణులై ఇంతకు బూర్వమెవ్వరును భావంబుననైన బడయని భోగంబులం దేలిరి. హిందూదేశము అదృష్టవశంబున వేయి రెండువేలేడుల కన్న మునుపే యింత మహర్దశకువచ్చె. కాని దురదృష్టవశంబున మన ప్రాచీను లింతకన్న మిన్నగనుండ నెన్నని కతంబున రానురాను క్షీణించి నేటికి క్షామము మహామారి ఇత్యాద్పుత్పాతముల పుట్టి నిల్లైనది.
పరివర్తన కళాయుగము
యూరోపియనులు ఇంతటితో దృప్తిజెందక పౌరుషోద్ధురులై పరివర్తన కళాయుగంబుం బురస్కరించితెచ్చి భూమండల రాజ్యమున రాజుగ జేసిరి. ఈ వర్తమాన యుగంబుయొక్క ఘనతర లక్షణంబు లెవ్వియన;
1. హస్తబలంబునకన్న యంత్రబలంబు ప్రధానంబు. మనుజులు చేతిపనులచే నలజడిగొనుట చాలమట్టునకు జాలించి ధీశక్తిచే బ్రకృతశక్తుల వశీకృతంజేసి తన్మూలమున సర్వకార్య సంఘటన చాతుర్యధుర్యులైరి. భూజలాగ్ని వాయువ్యోమాంతర్గత ప్రభావంబులను యంత్రంబులను పగ్గంబులంబంధించి యధేచ్ఛ సంచారములకుం బాపి మనుష్యశాసితంబులంజేసి నడుపుచున్నారు.
2. ఇంతదాక భూమిలోనివస్తుజాలముల బైనికిలాగు కృష్యాది పరిగ్రహణకళ లుత్తమములని యెన్నబడినవి. ప్రకృతము వీనికి లాఘవమును రూపస్థల భేదకారణములైన క్రియలగు పరివర్తనకళలకు శ్రేష్ఠతయు బ్రాపించె.