Jump to content

పుట:Bhaarata arthashaastramu (1958).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన:క్షయంబును నిద్రాతిశయంబును స్వాభావికంబులయ్యె. తత్కాలమునకు దు:ఖహేతువు గానిమాత్రమున వారల నట్లే యజ్ఞానాంధకారంబున గూలంద్రోసి కనులు గానకుండనిచ్చుట పరమపాతకంబు. ఏలయన ఎఱుకగల్గి యందుచే ఖేదము ప్రాపించి యప్పటికి వారిస్థితి నింకను హైన్యగతికి దెచ్చినను ఆ ఖేదబుద్ధియే దానిని నిర్మూలించి సంమోదానుభావము జెందవలయునను నాసగల్పించి యుత్సాహవంతులంజేసి నానాటికి పురోవృద్ధికి బీజమువంటిదౌను ఖేదామోదములులేనివౌట పశుపక్ష్యాదులు హర్షప్రకర్షాభిలాష కృతయత్నంబులుగావు.

కావున పాశుపాల్య మహాయుగంబు సర్వవిధముల నాగరికతకు మూలంబైనది.

అయినను స్థిరనివాసంబు లేర్పఱుచుకొనక వీరు మున్నుపాండవు లాహారకాంక్షచే ద్వైతకామ్యకాది వనములం బరిభ్రమించినరీతి గోగణపోషణార్థము దేశాటన పరులైరి వ్యవసాయ విధానంబులు వేద్యంబులైయున్న భూమినుండి స్వకృషిచే మనుజ మృగాళులకు వలసిన భుక్తి నలవఱచి పల్లెలు పట్టణములుగా నిద్ధస్ఫూర్తి నుండ వచ్చునుగదా! అవి నేరని కతంబున స్వయముగ నెదుగు పచ్చిక జాడలబట్టి యిచ్చోట శూన్యమైన నింకొక శాద్వలమునకును అక్కడనుం గడబడిన వేఱొక పచ్చిక పట్టునకుంగా గ్రుమ్మరువారైరి.

వ్యవసాయ మహాయుగము

తరువాత నెట్లో సేద్యముజేయ నారంభించి స్థలముల ఖాయముగ నాక్రమించి కుదురుపాటైన జీవనమునకుం దొడంగిరి. ఇందుచే మునుపటికన్న కలిమియెక్కుడై తన్మూలమున నాగరికత పెంపెక్కుటయు, పదిలముగ గుటుంబము లేర్పడుటంజేసి గృహస్థధర్మము లుద్భూతములై వాసింగాంచుటయు నివ్వటిల్లె. "ఎల్లిశెట్టి లెక్కయే లెక్క" అనునట్లు దినదిన మొకేతీరున మాంసక్షీరశాకముల బుచ్చు