పుట:Andrulasangikach025988mbp.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టివా రందరు కత్తి పారవేసిన వారగుటచే ప్రతిపక్షులు వారిని చంప కుండిరి. గడ్డికరచుట, ఐదు పది సేయుట=(అనగా రెండు చేతులు జోడించి మ్రొక్కుట కాని ముందు కాలిని వెనుకకు పెట్టి రెండు కాళ్ళను జోడించుట అని యొకరన్నారు.) వెన్నిచ్చుట, వెనుకంజవేయుట అన్న పదాల యర్థము కూడ యిట్టిదే.

ఆనాటి యుద్ధాలలో ఏనుగులు, గుఱ్ఱములు, ఎద్దులు ఎక్కువగా వినియోగ మవుచుండెను. దొరలు పల్లకీలలో యుద్ధానికి వెళ్ళుచుండిరి. ఆంధ్రుల సైన్యములో క్రమశిక్షణము, యూనిపారం, మేలైన మారణ యంత్రాలు తక్కువగా నుండెను. సంఖ్యాబలము పైననే ఆధారపడినవారు పలుమా రోడినారు. పల్నాటి యుద్ధములో బాలచంద్రుని కోతలకు నిలువలేని వారిలో కొంద రిట్లునుచున్నారు.

      "పగవారు మిముగని పారిపోవుదురు
       మీ కేమి భయ మని మెలత నాగమ్మ
       బాగుగా నమ్మించి పంప వచ్చితిమి
       జీవముల్ దక్కిన చిన్నల గలిసి
       బలుసాకు తినియైన బ్రతుకంగ గలము."[1]

ఇట్టి వెట్టిమూకలేనా జయము పొందునది: అయితే క్రమశిక్షణ మిచ్చిన సైనికులు లేకుండి రని కాదు. వారు చాల తక్కువ. ఓరుగంటి నగరములో 'మోహరివాడ' (Military Cantonement వంటిది) యుండేను. బహుశా ఆ సైనికులకు మాత్రమే మిలిటరీ యూనిఫారం దుస్తులు కుట్టుటకు కుట్రపువారేర్పాటైయుండిరేమో, ఆనాటి సైనిక యూనిఫారంలో అంగీ, చెల్లాడము, నడుముపట్టీ చేరినట్లుండెను. కాకతీయ రాజులకు 9 లక్షల సైన్యముండెను. "నవలక్ష ధనుర్ధరాదినాథే, పృథివీం శంసతి వీర రుద్రదేవే" అని విద్యానాథుడు వర్ణించెను. ఈ సైన్యములో ఎక్కువ భాగము సరిహద్దుల కాపాడు పాలెగార్లు లేక సామంతరాజులవద్ద నుండెను. ఈ పాలెగారు పద్దతియే ఆంధ్రరాజ్యాల నాశనమునకు కారణమయ్యెను. పాలెగార్లు కేంద్రప్రభుత్వ బలహీనతకై చూపెట్టు కొని సమయము దొరకగానే తిరుగుబాటు చేయుచుండిరి. మొత్తముపై

  1. పల్నాటి వీ. చ. పు. 110.