ఇట్టివి చాలా వ్రాసినాడు. అదంతయు ఉదాహరించుటకు వీలులేదు అభిలాషులు ఈ సీసమాలికలు పూర్తిగా చదువుకొనగలరు.
చాలామంది యిండ్లముంగిటి భాగాలలో పులి జూదపు ఆటగీతలను పలకరాళ్ళపై మలిపించి యుంచుచుండిరి.
"ముంగిట పులిజూదములు గీచియుండిన
రచ్చబండలు గొప్ప ప్రహరిగోడ" (4-123)
నేటికిని తెలుగుదేశమం దంతటను పల్లెలలో ఈ ఆచారము మిగిలి యున్నది.
కోడి పందెములు తెనుగువారి వినోదములలో చాలా ప్రాచీనమగు వినోదము. మన సారస్వతములో కేతనకవి కాలము నుండియు నారాయణకవి కాలము వరకు పలువురు కవులు ఈ పందెములను వర్ణించినారు. కోడి పందెపు శాస్త్రము కూడా చాలా ప్రాచీనమైనట్టిదే. నారాయణకవి ఈ విషయములో ఇట్లు వర్ణించినాడు:
"కాచిప్రాతలు దారాలు కట్టుముళ్ళు
ముష్టులును నీళ్ళముంతలు మూలికలును
కత్తులపొదుళ్ళు మంత్రముల్ కట్టుపసరు
లెనయవచ్చిరి పందెగాళ్ళేపురేగి
వేగ నెమిలి పింగళి కోడి డేగ కాకి
వన్నెలైదింటి కిరులందు వెన్నెలందు
రాజ్యభోజనగమన నిద్రామరణ
ములను విచారించి యుపజాతులను వచించి"
ఈ పందెమును గూర్చి ఇంకా నాలుగు పద్యాలిచ్చటనే కవి విపులముగా వ్రాసెను. (3-213)
శైవభక్తులలో వీరభద్ర పళ్ళెరము లిడుట ఆచారముగా నుండెను. (3-188)
జనులలో తాయెతులపై విశ్వాసము మెండుగా ఉండెను. ఈ తాయతు శబ్దము అప్పకవి నాటికే రూడియై పోయెను. తాయెతు శబ్దవిచార మిదివరకే చేసినాను.