అని కోరెను. ఈపద్యము శ్రీనాథునిదే! సందేహములేదు.
దాక్షారామవధూటీ
వక్షోరుహ మృగమదాది వాంఛిత విలస
దక్ష: కవాట బాంధవ
రక్షావిధి వజ్రపంజర కృపాజలధీ ![1]
"దక్షావాటీ .......గంధర్వపురోభామినీ"[2]
"దాక్షారామ చళుక్యబీమ వరగంధ
ర్వాప్సరో భామినీ, వక్షోజద్వయ గంధసార"[3]
అనుభాగాలను వ్రాసిన శ్రీనాథుడు పై చాటువున చెప్పలే దనగలమా ? ఆకాలములో పండితులు చదువుకొనిన విద్యలు పెక్కులుండెను. భారత రామాయణములు చదువని పండితులు లేకుండిరి. శ్రీనాథుని కభిమానులగు గీర్వాణవాణికవులలో కాళిదాసు, భట్టభాణుడు, ప్రవరసేనుడు, హర్షుడు, భాసశివభద్ర సౌమిల్ల భల్లులు, మాఘ భారవి బిల్హణులు, భట్టి చిత్తన కవిదండి పండితులును ముఖ్యులు[4] మురారిని పేర్కొనలేదు కాని అతని సమాసాలు చాలా వాడెను. తెనుగులో నన్నయ తిక్కన కవులును, వేములవాడ భీమకవి, ఎర్రాప్రెగడ అతనికి ముఖ్యులు. అతడు, "వినిపించినాడవు వేమభూపాలున కఖిలపురాణ విద్యాగమములు"[5] అని కీర్తనీయుడయ్యెను.
మరియు "అభ్యర్హిత బ్రహ్మండాది మహాపురాణ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళానిదానము"[6] అనియు పేరొందెను. డిండిమ కవిసార్వభౌము నోడించిన వాడెన్ని శాస్త్రాలు చదివి యుండవలెనో యూహించుడు. ఇతర పండితులును ఇన్ని శాస్త్రాలు చదివినవారై యుందురు. ఆకాలములోని కొన్ని శాస్త్రాల ముచ్చట యిట్లుండెను.