పుట:AndhraRachaitaluVol1.djvu/555

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బెక్కింట నిట్టి మెఱపులు తట్టుచుండును. ఇట్టి తత్త్వదష్టిలేని హాస్యరచయిత హాస్యాస్పదుడు కావలసినదే.

శ్రీ కామేశ్వరరావుగారి ప్రదర్శనములు, తదితర రచనలు నిటులుండగా, "త్యాగరాజు ఆత్మవిచారం" వారి కూర్పులలో గొప్పతావు నాక్రమించుకొనిన గ్రంథము. ఆరువందల సంఖ్యకు బైబడియున్న త్యాగరాజు కీర్తనములను తొమ్మిదిభాగములుగా విభజించి, కీర్తనార్థములు చక్కని వచనములో సంతరించినారు. పాఠవైవిధ్యమువలన దుర్గమార్థములైయున్న కీర్తనల సరసార్థములు తేర్చి సహజమధురమైన భాషలో నీగ్రంథము రచితమైనది. ఈకృతిలో శ్రీ కామేశ్వరరావుగారి విమర్శన పాటవము, సంగీతములో వారికిగల యభిమానము రూపము కట్టియున్నది. ఆయన యశస్సున కీగ్రంథము వైజయింతి. పద్యమునకు రాగమక్కఱలేదను వీరి సిద్ధాంతము జగమెఱిగినది.

వీరు ఆంగ్లమున బట్టభద్రులగుటయేకాక, సంస్కృతమున జక్కని సాహిత్యము కలవారును. 1920, 21 సంవత్సరములలో మదరాసు "ఎక్కౌంటెంటు జనరల్ ఆఫీసు" లో నుద్యోగించిరి. వాజ్మయారాధన దృష్టి ప్రబలముగా గలవారగుటచే, అది విరమించి రాజమహేంద్రవరము వచ్చి వీరేశలింగోన్నత పాఠశాలలోనుండి యిందాక అధ్యాపక పదవి నిర్వహించుచున్నారు.

                        ____________________