పుట:AndhraRachaitaluVol1.djvu/547

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి

1896

వెలనాటిశాఖీయబ్రాహ్మణులు. తల్లి: మణికర్ణికా సోమిదేవి. తండ్రి: వేంకట చయనులు. జన్మస్థానలు: ఇందుపల్లి. పెంచుకొన్న తలిదండ్రులు: కామమ్మ, రామయ్య. దత్తత, కొమానపల్లి. జననము: దుర్ముఖి నామ సంవత్సర- అధిక జ్యేష్ఠశుద్ధషష్ఠి-ఇందువాసరము. 1896 సం. రచనలు: 1. వేంకటేశ్వర శతకము 2. మునిత్రయచరిత్రము 3. శంకరవిజయము. 4. శబర శంకర విలాసము - ఇత్యాదులు.

ప్రతిభా వ్యుత్పత్తులు సరితూకములో నున్న కవులెందఱో యుండరు. ఆవిధముగా నున్ననేటి కవులు కొందఱిలో వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగా రొకరు. వీరు 'శంకరవిజయ' ప్రబంధకర్తలుగా నేడు మంచివిఖ్యాతి నందుచున్నారు. వీరి 'మునిత్రయచరిత్ర' ప్రౌడార్థప్రచురమైన రుచిరకావ్యము. ఈ రెండు కృతులును శాస్త్రిగారికి మహాకవితా పట్టము గట్టించుటకు జాలియున్నవి.

శ్రీసూర్యనారాయణశాస్త్రిగారు శిష్టవంశీయులు. వారితండ్రి వేంకటచయనులుగారు ఆహితాగ్నులు. చయనాంత క్రత్వనుష్టాతలును. తల్లిమణికర్ణికాసోమిదేవి. ఈపుణ్యదంపతుల కడుపు మనశాస్త్రిగారు. వీరు చిననాట శ్రీ మరువాడ కాశీపతి శాస్త్రిగారితో గాళిదాసత్రయము పఠించిరి. పదపడి, చావలి లక్ష్మీనరసింహశాస్త్రిగారి సన్నిధిని సాహిత్య గ్రంథములు, లఘుకౌముదియు నధ్యయనము చేసిరి. అప్పుడవ్ యాంధ్రకవితాభిరతియు నంకురించినది. లక్ష్మీనరసింహ శాస్త్రిగారి యాచార్యకమునెడల మన శాస్త్రిగారి కృతజ్ఞత చక్కనిది.

మ. కలమున్‌జేతను బూని పద్యమని యేకాసంతయున్ ప్రాయగా

దలపుంజెందినముందుమ్రొక్కవలెగాదా, సంస్కృతాంధ్రమ్ములన్