పుట:AndhraRachaitaluVol1.djvu/388

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

" సజీవ నిర్జీవ యుక్తంబగు జగంబు నియమయుతంబు విలసిల్లు చుండుటవలన నియమ మత్యావశ్యక మనుట యతిశయోక్తి గాదు. అట్లగుటవలన విజ్ఞలు నియమమును విడనాడుట యసమంజసము. ప్రవర్తన నియమమును స్మృతి విధించునట్లె భాషానియమమును వ్యాకరణము శాసించెడివి. కనుక వ్యాకరణవిరుద్ధ పదములతోడ వెలుయు కైత గర్హితమ యగును. నాణెములగు బాసలందు మిన్న యని యెన్నంబడు తెలుగుబాసకు సమగ్రమగు వ్యాకరణము నేటికిని లేకుండుట మిక్కిలి శోచనీయము. వ్యాకరణ మసమగ్ర మను నెపము చేత నున్న నియమములను మీఱుట యుక్తము గాదు......'వాడు' యొక్కయు 'అవి' యొక్కయు ద్వితీయానిభక్తిరూపము 'వానిని'. కనుక విభేదము కొఱకు 'అవి' యొక్క ద్వితీయావిభక్తిని "వాటిని" అని వ్యవహరించుట యుక్తము. "అయితే"-"కూతురును" మొదలగు కొన్నిరూపములు గ్రాహ్యములని సాయాశయము. భాషాభిమానముగల పండితులొకచోట గూడి గ్రహింప దగిన రూపములను నిర్ణయింప వలెను. మఱి యవియే వాడ బడవలెను. అట్లు కానిచో దెలుగు బాస కోదుబాస కంటె నీచతర మగును.

భాషావాద విషయములో విక్రమదేవవర్మగారిది మంచి పట్టుదల గ్రామ్యవాదమును సహింపనేరరు. అదియటుండ, ఏగుధాతువు-అమరసింహుడు, ధారుణరూపము, నన్నయభట్టుయుగము మొదలగు రచనలవలన వీరి విమర్శన నైశత్యము వెల్లడియగును. కథారచనలో గూడనీయనకు జాతురీ యున్నది. పయనపు జెలికాడు-ముసలిమగడు అనుకథలు ఆంధ్రిపత్రికలలో బ్రకటింప బడినవి. మంత్రిప్రెగడ మార్య ప్రకాశకవి "సీతారామచరిత్ర" మను ద్వ్యర్థికావ్యము రచింపగా, దానికి ------రచించినారు దానివలన వీరి పాండితీ విశేషము స్పష్టపడుచున్నది.ఆంధ్రసరస్వతిని వీరనేక రీతుల బోషించు చున్నారు. (పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు)