పుట:AndhraRachaitaluVol1.djvu/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"పలువురింతకు బూర్వమే తెలుగు చేసినట్టిదీనిని మరలజేయంగనేల, యనిన నయ్యవి కావ్యంబు గుణగుణంబు, తప్పె యగుగాని యరయ నాతప్పుగాదు." అనిచెప్పుకొని భవభూతి యుత్తరరామ చరితము నాంధ్రీకరించిరి. ఉన్న వానిలో నుత్తమమనుటకు వీలులేదు గాని వీరి యాంధ్రీకృతి చక్కగనున్నది. భాష బహుమృదువుగ నున్నది. సమాసములగడబిడ లేదు. మచ్చున కందలిపద్యమొకటి.


ఎండం బుల్గులు గూండ్లలోనొదిగి యెంతే స్రుక్కికూజింప గా మెండై కాకులుక్రిందనీడ బురువుల్ మేయంగ మిట్టాడగా గండూతిం గిరులెల్ల దమ్ము నొరయంగా రాలు పుష్పాళిచే నండం గల్గినభూరుహంబు లిదిగో యర్చించు గోదావరిన్.


మఱియొక ముఖ్యవిషయము: ఆంధ్రసాహిత్య పరిషత్పక్షమున 'శ్రీ సూర్యరాయాంధ్రనిఘంటు' వనుపేర నొకమహాకోశము రచింప బడుచున్న దని తెలుగుదేశ మెఱుగును. కొందఱు ప్రసిద్ధాంధ్రపండితుల సాహాయ్యమున శ్రీ రామయ్యపంతులుగా రీనిఘంటువునకు సూత్రపాతము వేసి రెండుసంపుటములవఱకు బ్రకటించిరి. ఈనిఘంటు కృతిభర్తలు శ్రీపీఠికాపురాధీశ్వలు శ్రీ రావు వేంకటకుమార మహీపతి సూర్యరావు బహద్దరువారు. శ్రీ మహారాజవా రీకృతికై దగ్గఱగ రెండులక్షలు వ్యయించిరి. శ్రీ వారి యౌదరాతిశయమువను, పంతులుగారి సంకల్పబలమునను నీ బృహత్కోశము పూర్తియయి యాంధ్రి నలంకరించు గాక!

రామయ్యపంతులుగారు ధన్యులు. వీరిపేరు నిఘంటువుతో పాటు సుస్థిరస్థాయి. గ్రాంథిఠాంధ్రీభవనమునకు నాలుగే యాధారస్తంభములు. ఆంధ్రసాహిత్య పరిషత్తు. శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు. పీఠికాపురాధీశ్వరులు. జయంతి రామయ్యపంతులు.

పంతులుగారు "ఆధునికాంధ్రవాజ్మయ వికాస వైఖరి" యను గ్రంథము వెలువఱిచిరి. నూతనాంధ్ర వాజ్మయ మెట్లు పరిణమించి నదియు కక్కగ నిందువివరించిరి. ఇది యుపయోగకరమగు కూర్పు.