పుట:AndhraRachaitaluVol1.djvu/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని యాయనశిష్యులుమాత్ర మలంకారవిద్యార్థులు కారు. పెండ్యాల వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగారు భద్రాద్రిరామశాస్త్రిగారి శిష్యులు.

శాస్త్రిగారు తమయిర్వదవయేట 'కాళిందీపరిణయ' ప్రబంధము రచించిరి. మచ్చున కీపద్యములు తిలకింపుడు.

కాయచ్చాయల వెల్వరించు వలిపెన్ గాటంపు నీరెండ గెం

జాయల్ పూనగదమ్మలంబు బటవాసద్రవ్యముల్ గంధ చ

ర్చాయుక్తిం బలుతావు లీన సఖిహస్తం బూని వాహ్యాళికై

సాయంవేళల వత్తురందు దరుణుల్ జానొప్ప బూదోటలన్.

వలరాజు తనదుపనులన్

మెలగింపం జెందకుండ నేర్పున దారిన్

వలవైచి పట్టె ననగా

దిలకింపం దగిరి దోమ తెరమంచములన్.

శంతనూపాఖ్యానము 32 వ సంవత్సరమున సంతరించిరి. అది చక్కని ప్రబంధము. ఈకవివరుడు కేవల ప్రాచీనకవితా ధోరణికలవాడేగాక నవీనపథమున గబ్బము లల్లుమేధావి కూడను. వీరి 'చిత్రసీమ' కావ్యము పరికించిన నిది స్పష్టపడును. చిత్రసీమ కళాపూర్ణోదయమును బోలు కల్పితకావ్యము. ఇందు గృత్యాద్యవస్థ లేదు. ఇదిక్రొత్తపద్ధతి. "కల దొక రాచకూతురు.." అని కావ్యము నుపక్రమించినారు. ఇందలి యాశ్వాసములకు దళము లనిపేరు. అవియు ద్వితీయదళము మొదలుకొని యారంభింప బడినవి. తత్కారణము గ్రంథములో విశదమగును. 'మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని శాస్త్రాణి ప్రథంతే' యనుచొప్పున నాది మధ్యాంతములందు గృతినాయకుని స్తుతించుపద్యములు రచించె. ఆపద్యములు కేవలషష్ట్యంతములు గాక ద్వితీయాద్యంతములుగా వ్రాయుట మఱియు నూతనత. ఆపద్యములలో భూతభావికథలు సూచితములు. ఈకావ్యములో గార్యముముందును, గార