పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“అవును మహాప్రభూ! పారశీక, యవన, రోమకదేశాల వర్తకానికి భరుకచ్ఛం ఉండితీరాలి. లేకపోతే ఈ మహాసామ్రాజ్యానికి ఎంతో నష్టం సంభవిస్తుంది.”

మాళవ మహారాజు రుద్రసేనుడు తన సైన్యం కొంత తన సేనాపతి నడుపు తుండగా ఆంధ్ర సైన్యాలతో పంపించినారు. అభీరులు తమ సైన్యాలతో ఆంధ్రులకు నర్మదాతీరాన అడ్డువచ్చారు. శాంతిమూల మహారాజు శాతవాహనుల దళాలతో సైన్యమధ్యభాగమును, బ్రహ్మదత్తుడు ఇక్ష్వాకు సైన్యాలతో ఎడమ భాగమును, మాళవసైన్యాలు మాళవ సేనాధిపతి నాయకత్వంతో కుడిప్రక్కకు నిలిచారు. ఎదుట అభీరులు నర్మదానదికి నదీతీర రాజపథం పక్క కొండలను మూడుక్రోశాలు ఆక్రమించుకొన్నారు. భరుకచ్చానికి పోవాలంటే ఈ దారికన్న వేరు మార్గం లేదు. అభీరు లాక్రమించిన ఆ దుర్గమ ప్రదేశం మీదకు తమ సైన్యాలను నడపడం వినాశన హేతువని శాంతిమూల మహారాజు నిమేషంలో గ్రహించినాడు.

ఆంధ్రసైన్యాలు తమ శిబిరాలను అభీరసైన్యాలకు ఎదురుగా ఉన్న కొండలమీద నిర్మించుకొని, ఆ కొండలప్రదేశం కోటలా సిద్దం చేసుకొన్నారు. వెనుకనుంచి అభీరులు వచ్చి తాకకుండా మాళవసైన్యాలు రాజపథమునకు పొడుగునా ఈవలావల ఎత్తైన ప్రదేశంలో మూడుయోజనాల దూరంవరకూ ఆక్రమించాయి.

యుద్దరంగం స్తంభించింది. అప్పుడు బ్రహ్మదత్త ప్రభువు శాంతి మూల మహారాజుకడకు వచ్చి “మహాప్రభూ! నేను మన సైన్యాలతో వెనకకేగి, కొండలుదాటి, నర్మదానదిని ఎగువభాగంలో దాటి తపతీనది తీరాన్నే అడవులలో, కొండలలో చొచ్చిచని బరుకచ్ఛాన్ని ముట్టడిస్తాను. ఆ వార్త వచ్చిన వెంటనే ఈ శత్రు సైన్యాలు భరుకచ్ఛ రక్షణకు రావాలి. లేదా మీతో యుద్ధానికి తలపడాలి” అని మనవి చేసెను.

“అభీరులలో కొంతమంది మాత్రమే మిమ్ము వెనుకనుంచి వచ్చి తాకితే?”

“మాళవ వేగులను అభీరులను కనిపెడుతూ ఉండమనండి. అభీర సైన్యాలలో కొంతభాగం భరుకచ్చం సాగితే మాళవ సైన్యాలను నాకు సహాయంగా పంపించండి.”

“మీ ఆలోచన బాగుంది స్కందవిశాఖ ప్రభూ!”

శాంతమూలుడు బ్రహ్మదత్తునికి ఆనతి ఇచ్చినంతట బ్రహ్మదత్త ప్రభువు కొండలుదాటుతూ, అడవులవెంట వేగంగా సాగిపోయి భరుకచ్చం ముట్టడించాడు. ఎంత రహస్యంగా వెళ్ళినా బ్రహ్మదత్తుడు వస్తున్న వార్త ముందుగానే భరుకచ్ఛవాసులకు తెలిసింది. అందుకనే వారు సర్వసిద్ధంగా ఉండి బ్రహ్మదత్తుని కోటదగ్గరకు రానీయకుండా చేయగలిగినారు. ధనక విశాఖాయనక ప్రభువు ఇలా జరుగుతుందని ఇదివరకే అనుకున్నాడు.

దారి పొడుగునా బ్రహ్మదత్తుడు భరుకచ్ఛపు కోటను పట్టుకొనే విధానం ఆలోచిస్తూనే వచ్చాడు. ఖరుకచ్ఛం మహాపట్నం. ఆ పట్నంలో, ఆ పట్టణం చుట్టుప్రక్కల ప్రదేశాలలో రోమకులు, పారశీకులు, బాహ్లికులు, యవనులు, ఇగుప్తులు ఎంతమందో కాపురాలుండి వర్తకాలు చేస్తూ ఉంటారు. కాబట్టి పట్నం కోటచుట్టూ పది గోరుతముల పొడవు ఉంటుంది. పట్నంలో ఎన్నో చిన్న చిన్న కోటలు చాలా ఉన్నాయి.

అడివి బాపిరాజు రచనలు - 6

55

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)