పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3

రాజ్యాలు అవసరమా? కృతయుగంలో ఆశ్రమాలు, నగరాలు, నగరాలలో వ్యవహార దక్షులయిన ఆర్యులు సంఘాలు స్థాపించి క్షత్రియత్వం తమ జాతినీ యజ్ఞయాగాది క్రతువులను, ధర్మాన్ని రక్షించడం అంతేగదా ఆర్యమానవ జీవితం. మూడుయుగాలలో ఎంత మారిపోయింది. మానవ జీవితం? రాజ్యాలు స్థాపించడం అవసరమైంది. వృద్ధిపొందే మానవజాతికి సాత్విక, రాజసిక, తామసిక గుణసమేతులైన మానవులు మహాసంఘాలను స్థాపించారు. రక్షణకు, శాంతికీ వృద్దికీ, బడాయికీ, అభిమానానికీ, ఆశకూ రాజ్యస్థాపన, రాజ్యాభివృద్ధి, సాంకేతిక విద్యలూ కారణాలు అయ్యాయి. ఈ సంస్థాపనకై ప్రజానాశనము తప్పదా? ప్రజారక్షణా, ప్రజాశాంతీ, ప్రజాభివృద్దీ - ఇవే ఆశయాలయినప్పుడు ఆ ఆశయాలకు ప్రజాహింసా, ప్రజాసంక్షోభం, ప్రజానాశనమూ ఏలా మార్గాలు అవుతాయి?

బ్రహ్మదత్తప్రభువు ఈ ఆలోచనలతో సంక్షుభిత మసస్కుడై స్కంధావారం మధ్య తన శిబిరంలో కృష్ణాజినాసనస్థుడై వణకిపోయినాడు. ఈ యువక ప్రభువున కిదే మొదటి పర్యాయము జైత్రయాత్రలకు రావడం. తన విక్రమం, విజ్ఞానం, విజయతృష్ణ తనకు విజయం చేకూర్చవచ్చు, లేదా తన్ను నాశనం చేయవచ్చు. కాని ఈలోపున ఎందరు అంధ్రవీరులు, ఎందరు అభీరులు నాశనం అయిపోవాలి! ఆంధ్రులే ఈలా సర్వసామ్రాజ్యాధినేతలు ఎందుకు కావాలి? అభీరులు ఈ రాష్ట్రం ఆక్రమించి, ఇక్కడే నివసించి, ఇక్కడే పుట్టి, పెరిగి, ఇక్కడే మట్టిలో కలుస్తున్నారు. ఇక్కడ ఉండే ప్రకృతిలో వారు భాగం; వారిలో ఈ ప్రకృతి భాగం. ఈ మహానదాలు రెండూ, ఈ వింధ్యాంత శ్రేణీ ఈ ఫలవత్తర భూమీ, ఈ సముద్రమూ, ఈ రేవుపట్టణమూ వీరివి. ఇందులో భాగం పంచుకోడానికి శాతవాహనులకు ఇక్ష్వాకులకు ఏమి స్వత్వం ఉంది?

ఆలోచనలోపడి ఏదీ నిశ్చయం చేసుకోని స్కందవిశాఖాయనక ప్రభువు కడకు యవనులు, పారశీకులు ఆర్యులు కొందరు రాయబారానికి వచ్చినారు. బ్రహ్మదత్త సేనానాయకుని అంగరక్షాధిపతులు వారిని సగౌరవంగా బ్రహ్మదత్తునికడకు కొనివచ్చారు. బ్రహ్మదత్తప్రభువు లేచి వారిని ఎదుర్కొని ఉచితాసనాల కూర్చుండబెట్టి “తాము దయచేసినపని ఏమి?” అని పృచ్చ చేసినాడు.

భరుకచ్ఛంకోటలో యవనులకు, రోమకులకు, పారశీకులకు, యూదులకు వర్తకం చేసుకొనే మహాభవనాలున్నాయి. అవి చిన్న చిన్న కోటలవంటివి. ఆర్యవర్తకులకు అట్టి చిన్న కోటలున్నవి. బ్రహ్మదత్తుని కడకు రాయబారానికి వచ్చిన వారంతా అలాంటి కోటలకు యజమానులు.

యవనవర్తకుడు: శాతవాహనప్రభూ! ధాన్యకటక మహారాజులు మాకు ఇక్కడ ఆశ్రయం ఇచ్చి మా వర్తకం సర్వవిధాలా వృద్ధిపొందేటట్లు చూచినారు. మాకు వారెన్నో రక్షణలు కల్పించిరి.

పారశీకవర్తకుడు: శ్రీయజ్ఞశ్రీ చక్రవర్తికీ జబ్బుగా ఉంది అని తెలిసినప్పటినుంచీ ఈ అభీరసామంతులకు ఎక్కడలేని ధీరత్వమూ వచ్చి మాబోటి వర్తకులనందరిని బాధిస్తున్నారు.

అడివి బాపిరాజు రచనలు - 6

56

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)