“అంత యనన్యభక్తియుండవలెను. అప్పుడే జన్మము తరించును.”
“ఆ చంద్రావతికి సర్వకాలములయందును శ్రీశైల దేవుడైన యర్జునేశ్వరస్వామి ప్రత్యక్ష మగుచుండెడివాడట. చంద్రగుప్తమహారాజు ఆంధ్రసార్వభౌముడైన శ్రీ విక్రమాశ్రయ గోవిందవర్మ విష్ణుకుండిన మహారాజునకు దన కొమరిత నిత్యము నర్జనేశ్వరు నర్చించుట కనుమతిని వేడుచు రాయబారమం పెనట.”
“అవును! పవిత్ర శ్రీశైలక్షేత్రము వారి రాజ్యముననే కదా యుండినది!”
“చంద్రావతి తగుపరివారముతో శ్రీశైలక్షేత్రము చేరినదట. ఆమె చంద్రావతి, సోమవంశజ, చంద్రగుప్తుని తనయ. ఆమె వెన్నెలయే రూపొందిన మల్లికా కుసుమములను మాలలుగ రచించి జంద్రచూడుని జటామకుటముపై నలంకరింప సంకల్పించినదట.”
“ఓహో! ఏమి విచిత్ర చంద్రికాభావము!”
“మహాప్రభూ! శ్రీశైలగిరిపై మల్లికా నికుంజములు పెంచినారు పరిచారికలు. బొడ్డుమల్లెలు, జంటమల్లె, సదా మల్లెలు, గుత్తులు గుత్తులై రాసులు రాసులై యా కొండను రజతాద్రి తుల్యముగ జేసినవట.
“ఇది యంతయు మహాపవిత్రమైన గాదయే.”
“చంద్రావతీదేవి భక్తికి బరమశివుడు కరుణించి యామెకు స్వప్నమున సాక్షాత్కరించి, "చంద్రావతీ కుమారీ! విష్ణుకుండిన మహారాజు గోవిందవర్మకు నా యంశమున మాధవవర్మ జనించినాడు. ఆతని నీ వుద్వాహ మయ్యెదవు గాక! ఇది మొదలు వట్టి యర్జునేశ్వరుడుగా గాక మల్లికార్జునుడుగా బ్రసిద్ధి గాంతు”నని యనుగ్రహించి యంతర్ధాన మయ్యెనట. విష్ణుకుండిన మంచన భట్టారకుని తల్లి యేయా చంద్రావతీదేవి.”
“ధన్యుడను. ఈ గాధయే సర్వపాపహరణము. మనము శ్రీ మల్లికార్జునదేవు దర్శనము నెంతేని తొందరగ జేసికోవలెను.”
శ్రీశైల పుణ్యక్షేత్రము శిఖరము దర్శించినంతనే యెట్టి పాపాత్ములైనను బుణ్యమూర్తులై తేజోవిలసితు లగుదురట. ఎంత దివ్యక్షేత్రమిది! అని చాళుక్యుడు మనస్సున నా శ్రీశైల పుణ్యపర్వతమునకే జోహారు లర్పించుకొన్నాడు.
చాళుక్యులు మొదటనుండియు శివభక్తి పూరితులు. వారు పరమమాహేశ్వరులే యగుదురుగాక. ఆ దీక్ష అతని బులకితుని జేసినది.
“హే!
నాగభూష! నందివాహా!
నిన్ను దెలియ, నిన్ను కొలువ
నన్నుబోటి వారలేడ
నాగశయన మిత్ర! దేవ!
వేగరావ! నన్ను బ్రోవ!
నాగభూష! నందివాహన!”
అని యా ప్రభువు మధురదీప్త కంఠమెత్తి పాడుకొనినాడు.
అడివి బాపిరాజు రచనలు - 6
• 275 •
అంశుమతి (చారిత్రాత్మక నవల)