పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాలిక శాంతిశ్రీపై ఉరకడంతోడనే గర్భగుర్విణి అయిన మహారాణి భర్త శవంపైనుండి చటుక్కునలేచి, 'ఆగు' అని అరచింది. ఆమె కన్నుల నీరు కారిపోతున్నది. ఆమె గజగజ వణికిపోతున్నది.

“ఆగు” అన్న మాటకు ఆ బాలిక ఆగిపోయినది.

“ఎవరు నువ్వు?”

“నేను మహారాజునకు నూత్నరాజ్ఞిని.”

“చెల్లీ! మనకర్మవల్ల సంభవించిన ఈ విపత్తుకు శాంతిపుంజమైన శాంతిశ్రీ రాకుమారి కారణమా? నువ్వు వెళ్ళు రాకుమారీ! మమ్ము మా దుఃఖం దహించి వేయనీ” అని పలికి నెమ్మదిగా లేచి ఆ కొత్తబాలిక దగ్గరకుపోయి “చెల్లీ రా. మనం భక్తితో సహగమనంచేసే సన్నాహాలు చేసుకోవాలి” అన్నది.

శాంతిశ్రీ ఒక్క ఉరుకున మహారాణి కడకువాలి “మహారాణీ! నువ్వు నిండు చూలాలివి. సహగమనచితాగ్ని ఎలా అధివసించగలవు? అది దోషం. నువ్వు శిశుహత్యా దోషానికి పాలుబడతావా?” అని అడిగింది. మహారాణి తెల్లబోయి ఆగిపోయింది. “మహారాణి! నీకు పుట్టుబోయే కుమారుని దుర్విధివిపాకాన కాల్చివేస్తావా? నీ భర్తకూ నీకూ గతులువద్దా?” అంటూ శాంతిశ్రీ నిశ్చల లోచనాంచలాల అశ్రుబిందువులు దొరగగా ప్రశ్నించింది.

వైద్యుడు “మహారాణీ! శాంతిశ్రీ మహారాజకుమారి మనవి పాటించండి. ఈ గర్భస్థ శిశువును నాశనం చేయడానికి మీకు ఏమి అధికారం ఉంది?” అని మనవి చేసినాడు. ఇంతలో గుమ్మం దగ్గరనుండి “మహారాణీ! పులమవి మహారాజు సింహాసనానికి కూడా ధాన్యకటక సింహాసనం గతిపట్టించకు” అని గంభీర వాక్యాలు వినబడేసరికి అందరు సంభ్రమాన గుమ్మంవైపు తలఎత్తి చూచినారు. గుమ్మందగ్గర దివ్యకాంతితో తేజరిల్లుతూ బ్రహ్మదత్తప్రభువు నిలిచి ఉన్నారు. శాంతిశ్రీ “గురుదేవా! మీరెప్పుడు వచ్చినారు” అని అడిగి ఆయన పాదాల వాలినది. బ్రహ్మదత్తుని వెనుకనుండి “మహారాణీ! ధర్మానికి బద్ధురాలవై కుమారుని ధర్మస్వరూపునిగా పెంచటం మీ కర్తవ్యం. రాజధర్మాన్ని ఉల్లంఘించకండి” అని శాంతిమూల మహారాజు ముందుకు వచ్చారు. మహారాణి తలవంచుకొని 'అలాగే' మౌనాంగీకార సూచకంగా శాంతమూలునికి బ్రత్యుత్తర మిచ్చింది.

★ ★ ★

అడవి బాపిరాజు రచనలు - 6

215

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)