పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“చిత్తం మహాప్రభూ!"

ఓడ ప్రత్యూప పవనాలకు ఊగిపోతూ నాట్యకత్తియలా సాగిపోతున్నది. బ్రహ్మదత్తుని హృదయము ఏదో ఆనందంతో నిండి పోయింది.

  ఈ మహాసంద్రమే విశ్వం
  విశ్వమధ్యమ్ములో ఈనౌక!
ఏ తీరమీ మధుర వాతాంకురము పుట్టి
ఏ తీరముల చేర నేతెంచు చున్నదో?
ఏ మహాజలరాశి నీతరంగా లుద్భ
వించి సర్వాశలకు పయనించిపోవునో?
ఏ చిత్రలోకాల నీమనసులోకమ్ము
ఉదయించి కాలాన పదములిడివచ్చునో?"అని పాడుకొన్నాడు.

తాను ధనకప్రభువు. తనరాజ్యంలో బంగారం పండుతుంది. తన కోశాగారంలో కోటకొలది సువర్ణఫణాలు రాసులుపడి ఉన్నాయి. తన తండ్రి బుద్ది బృహస్పతీ, అఖండ వీరుడూ, తమ సైన్యాలు ఇక్ష్వాకురాజ్య సైన్యంలో ముందంజవేసేవి. అందుకనే మహారాజు తనకు కూతునీయ సంకల్పించారు.

తానొక సామాన్యుడైతే మహారాజు తనకు బిడ్డనీయ నెట్లు సంకల్పిస్తారు? కాక, శాంతిశ్రీ రాకుమారి సాధారణ కుటుంబపు బాలిక అయితే నామెను ఉద్వాహం కావడానికి ఒప్పుకుంటాడా తాను? ప్రపంచమంతా ఈలా ధనానికీ, ప్రాభవానికి బానిస అయి ఉన్నదా?

తనకు వివాహం చేసుకోను అనగలిగిన వైరాగ్య భావము లేదు. తన హృదయంలో బౌద్ధ భావాలకు చోటులేదు. తాను ఆర్ష ధర్మ ప్రకారం వివాహం చేసుకోవాలిగదా? అలాంటి సమయంలో మహారాజు తమ కుమార్తెను తనకు ఇస్తామంటున్నారు.

ఈ ఆలోచనకి అడ్డం తగులుతూ, నౌకానాయకుడు పరుగున వచ్చి బ్రహ్మదత్త ప్రభువునకు నమస్కరించి "ప్రభూ! గాలివాన పుట్టే సూచనలు కనబడుతున్నవి. వసంత కాలంలో గాలివానలు రావడం అరుదు. ఇరవై ఐదేళ్ళకో పర్యాయము ఈలాంటి గాలివానలు వస్తూ ఉంటాయి. మనం తీరం చేరడానికి వ్యవధిలేదు! గాలి తీరంవైపునుంచి తూర్పుగా సాగేటట్లున్నది. కాబట్టి మనం ఈశాన్యంగాపోయి మహానదీ ముఖద్వారం చేరుకోడానికి ప్రయత్నిద్దాము” అని మనవి చేశాడు.

ఆ నాయకుడు అనడం ఏమిటి ఇంతట్లో పడమట దూరంగా చక్రవాళాచలముపై నల్లని కాదంబినీమాల ప్రత్యక్షమైంది, గాలిపూర్తిగా ఆగిపోయింది. ఉక్కపోత ఎక్కువైంది. గాలిపీల్చుకోడం కష్టంగా ఉంది. సముద్రపునీళ్ళల్లో తళుకు ఎక్కువైంది. రాబోయే గాలివానపై గౌరవంతో కెరటాలు అడగిపోయినవి.

బ్రహ్మదత్తుడు చిరునవ్వుతో “నీ ప్రయత్నంలో నువ్వు ఉండు” అన్నాడు.

“ప్రభూ! నేను గాలివానకు సిద్ధంచేయాలి మన నౌకను. తాము గాలి వానలో ఎప్పుడు ఓడమీద ఉన్నవారుకారు.”

అడివి బాపిరాజు రచనలు - 6

99

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)