వ్యాస పరంపర
ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి 9848123655
పడమటి గాలితో
నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద
(మార్చి నెల సంచిక తరువాయి)
భారతదేశానికి క్రీస్తుపూర్వం నుంచే ఇతర దేశాల ద్వారా వర్తకం వివిధ రూపాలుగా విస్తరించింది. ప్రతిఏడాది కనీసం 120 ఓడలు భారతదేశం చుట్టూ ఆవరించి వ్యాపారం జరిపే వారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. యేసుక్రీస్తు శిష్యుడు తోమా క్రీ.శ 53లో పర్షియా దేశం నుంచి దక్షిణ భారతదేశంలోని మలబారు తీరం పెరియార్ ప్రాంతంలోని క్రాంగనూరు వచ్చాడన్నది చరిత్ర. ఐతే అంతకు ముందు నుంచే అంటే దాదాపు క్రీ.పూ. 1500 ప్రాంతంలో దక్షిణ భారతదేశానికి శ్రీలంకకు దక్షిణ తూర్పు ఆసియా నుండి కొబ్బరి కాయలు, చెరకు, చందనం, దాల్చినచక్క ఇతర సుగంధ ద్రవ్యాల వ్యాపారం జరిగింది. ఆఫ్రికా మీదుగా భారతదేశానికి రోమన్ చక్రవర్తి ఆదేశానుసారం క్రీ.పూ. 61వ సంవత్సరం సెప్టెంబరు 9 నుంచి క్రీ.శ. 14 ఆగస్ట్ 19 వరకు వాణిజ్య నౌకలు తక్కువ కాలంలో విస్తృతంగా వచ్చాయి. క్రీ.శ. మొదటి శతాబ్దంలో రోమన్లు బాగా వాణిజ్యం వృద్ది చేశారు. అప్పుడే బంగారం వ్యాపారం బాగా జరిగిందని ప్లినీ రచనల్లో ఎన్. హెచ్.51.101లో స్పష్టంగా ఉంది. రోమన్ల కాలంలోనే అలెగ్జాండ్రియా నుంచి మద్రాసు (అప్పుడు పులియార్కట్టం అని పేరు) కి రాకపోక లున్నాయి. 15వ శతాబ్టీకి చైనా నుంచి, 16వ శతాబ్దికి జపాన్ నుంచి భారతదేశానికి నౌకాయానం ద్వారా వ్యాపారం జరిగింది. 15వ శతాబ్టీ ప్రథమపాదంలో చైనానుంచి ఇండియా, అరేబియా సోమాలియా, ఈజిప్ట్ తదితర దేశాలకు సిల్కు వస్త్రాల వ్యాపారం జోరుగా సాగింది. ముస్లిముల కాలం ప్రారంభంనాటికి గుజరాత్, కలకత్తా ప్రాంతంలో వస్త్ర వ్యాపారంతో పాటు మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాల వ్యాపారం పుంజుకుంది. గుజరాత్ నుంచి భారతీయులు కూడా సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసినట్టు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. శ్రీనాథుని కాలంనాటి అవచి తిప్పయశెట్టి సుగంధ ద్రవ్యాలు, సిల్కు వస్తా వ్యాపారాల్లో బాగా అనుభవమున్న వ్యాపారవేత్తగా మనకి తెలుసు. ఐతే అవచి తిప్పయశెట్టి ఏ ప్రాంతం నుంచి వ్యాపారం చేశాడన్నది యిదమిత్ణంగా తెలియదు. భారతదేశానికి ఇతర దేశాలకి క్రీస్తుపూర్వం నుంచే వ్యాపారం జరిగిందనడానికి ఇవి కేవలం రేఖామాత్ర ఉదాహరణలు మాత్రమే. నౌకాయాన వ్యాపారంపై ఆసక్తిగల వ్యాసాలు పుస్తకాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ History Indian Shipping 1912 edition - Radhakumud Mookerji ఇంకా ఇతర గ్రంధాలు సంప్రదించవచ్చు.
అలెగ్జాండ్రియా నావికుడైన హిప్పలస్ నౌకాయానం, సముద్రయానంపై పరిశోధనలు చేశాడు. క్రీ.పూ. మొదటి శతాబ్దికే గాలి వాటాన్ని పరిశోధించి వార్షాకాలం ఆగ్నేయ దిశనుంచి అరేబియా సముద్రం మీదుగా వీచి, తరువాత దాని గమనం ఈశాన్య దిశకు మారుతుందని తెలుసుకున్నాడు. ఈ పరిశోధనలవల్ల పాశ్చాత్య దేశాలు వర్షాకాలంలో భారతదేశానికి సుగంధ ద్రవ్యాల వ్యాపారం నిమిత్తం వచ్చేవారు. ఈ కాలంలోనే క్రీస్తు శిష్యుడయిన తోమా భారత దేశానికి వచ్చాడన్నది స్పష్టం. క్రాంగనూరులోని నాలుగు బ్రాహ్మణ కుటుంబాలు కాళి, కాళియంకార్, శంకరపురి, పాకలో మట్టం అనే వారికి క్రైస్తవ ధార్మిక సిద్ధాంతాలు, క్రీస్తు బోధలు వివరించినట్టు చారిత్రక కథనం. వీరే భారతదేశంలోని తొలి క్రైస్తవ కుటుంబాలని చరిత్ర కారులు నిర్ధారణ అనంతరం క్రాంగనూరుకు దక్షిణంగా ఉన్న మలియన్ కార, పాలయార్, గోకమంగళం, నీరాణం, చాయల్, క్విలాన్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి మలయాళంలో యేసు గాధలు బోధలు తాళ పత్రాలపై రాసి పంచి పెట్టాడు. అనంతరం మలబారు ప్రాంతం నుండి చెన్నై పట్టణంలో క్రీస్తునుగూర్చి బోధించి తమిళం, తెలుగు భాషల్లో 'ప్రార్దనాదికాలు నిర్వహించేవాడు. తోమా క్రైస్తవ్యాన్నీ ప్రచారం చేస్తున్నాడని అక్కడి పురోహితవర్గం క్రీ.శ. 72లో తోమా ఒంటరిగా వస్తున్న సమయంలో దొమ్మిగా పడి ఈటెలతో పొడిచి చంపారు. ఆయన స్మృత్యర్థం నేడు శాంతోమ్ అనే తామన్ మౌంట్ గా మద్రాసు (చెన్నై) లో సుప్రసిద్ద పుణ్యక్షేత్రంగా ఉంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది.
సెయింట్ తామన్ మద్రాసులో క్రీ.శ. మొదటి శతాబ్దం నాటికి యేసునేర్పిన పరలోక ప్రార్థన తమిళంలో నేర్పించా డన్నది జగమెరిగిన సత్యం. అప్పుడే తెలుగులో కూడా ఆయన అనువదించి నేర్చించాడన్నదానికి ఆధారాలు లేవు. కాని పరంపరీణంగా మౌఖిక ప్రచారంలో తెలుగు భాషలో కూడా ఆయన ప్రసంగించినట్టు 16వ శతాబ్ధిలోని ప్రాన్సిస్ జేవియర్ లేఖలవల్ల తెలుస్తుంది.
తోమా అనంతరం భారతదేశంలో వర్తకాలు వాణిజ్యపరంగా బాగా జరిగాయి. తూర్పు సిరియా, మెసపొటేమియా, పర్షియా దేశాలతో రాకపోకలున్నాయి. ముఖ్యంగా కేరళ, మద్రాసు ప్రాంతానికి ఆనాటికే నౌకావాణిజ్యం కొంత జరుగుతూ ఉండేది. సరిగ్గా క్రీ.శ 345లో ఎడెస్సా ప్రాంతం వాడయిన వీషవ్ తామన్ మలబారు వచ్చాడు. ఆయన జట్టుకు నాయకత్వం వహించిన కనాయి తోమా (Thomas of Canon) అనే సిరియా వ్యాపారవేత్త సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేశాడు. అతని వ్యాపారానికి అనువుగా, తోడుగా ఉండాలని సిరియా నుంచి కొందరిని దక్షిణ భారతదేశంలోని మలబారు స్థావరంగా ఏర్పాటు చేసుకున్నాడు. వ్యాపారంతోపాటు వాణిజ్య పంటలు కూడా పండించేవాడు. ఆయనతో వచ్చిన సిరియా వాసులకు నిత్యం బిషప్ తామస్ ప్రార్దనాదికాలు నిర్చహించేవాడు. కనాయితోమా అప్పటి క్రాంగనూరు రాజు పెరుమాళ్తో సఖ్యత ఏర్పరచుకుని మంచి పేరు సంపాదించాడు. సిరియా నుంచి వచ్చి ఇక్కడ స్టిరపడిన వాళ్లకు క్రాంగనూరు ప్రాంతంలోని దేశీయ జాలర్లు అయిన పరవర్లకి అంతర్వర్ణ వివాహాలు జరిపించిన ఖ్యాతి కనాయితోమాకే దక్కుతుంది. అలా స్టిరపడిన సిరియన్ క్రిస్టియన్లుగా నేటికీ సుప్రసిద్దులు. ఇక్కడ పరవర్లు అనే మత్స్యకారుల గురించి ఒక విషయం ప్రస్తావించాలి.
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి జూలై-2020
35