ప్రకరణము ౨౧ - మరల ముట్టడి ప్రయత్నములు
111
తానాషా ఆజ్ఞ గానుండును. ఇంతలో సాయంకాల మాయెను. మొగలాయీలు చేయునది లేక నాఁటి యుద్ధమును మానుకొని తమ గుడారముల నాశ్రయించిరి.
మఱునాఁడు తెల్లవారఁగానే పాదుషా దిగ్విజయము బయలుదేరెను. మూఁడవ సొరంగమునకు నిప్పంటించునప్పడు తానే సమీపమున నుండవలయునని ఢిల్లీశ్వరుని సంకల్పము సముద్రమువలె మొగలాయీసైన్యము ఘోషతో బయలుదేఱెను. కవచములు ధరించిన యోధులు తిమింగిలములవలె నుండిరి. ధూళిధూసరితమైన యాప్రపంచమున యోధుల శిరస్త్రాణములు నీటిమీఁది బుడగలవలె మినమిన లాడుచుండినవి. పాదుషా నల్లని గుఱ్ఱముమీఁద నెక్కి యమధర్మరాజువలె వచ్చుచుండెను. సర్దారులందఱును పాదుషా వెనుక వారివారి తరగతుల ప్రకారము వచ్చుచు తానాషాను పట్టు యమకింకరులవలె నుండిరి. కొందఱు సిఫాయీల దుస్తులు ఎఱుపుగానే యుండెనుగాని మొగములు మాత్రము దుఃఖావృతమై వెలవెల పాఱియుండెను. కొన్ని గుఱ్ఱములు వాని యస్థిపంజరములవలెను వానిమీఁది కవచములు చర్మముల వలెను వానికి కాఁబోవు దుర్దశను సూచించునట్లుండెను.
కోటగోడలను సమీపించినంతట పాదుషా మూఁడవ సొరంగమునకు నిప్పంటించుటకు ఉత్తరువిచ్చెను. అది ఎంత మాత్రము మండలేదు. ఒక నిప్పురవ యైనను రాలేదు. గోలకొండవారు మందును పూర్తిగా తీసివేసి వత్తిని సైతము కత్తి