వస్తువులను వాడుకొనగూడదని యిటీవల వ్రతముధరించెను. ఈ వ్రతము నీమె దినదినమును దృడముగా బాలించుచుండెను. తన కట్టకడపటి వ్యాధిలో గాళ్లకు ఉన్ని మేజోళ్లను దొడగవలసినదని డాక్టర్లుచెప్పగా, బజారునుండి మేజోళ్లు తెప్పించిరి. అంతవ్యాధిలో గూడ నా నారీమణి యా మేజోళ్లమీది గుర్తులు చూచి "ఛీ యివి స్వదేశములో జేసినవి కావు" అని వానిని బారవైచి, స్వదేశములో జేసినవాని నపుడు తెప్పించి తొడుగుకొనెను. ఆహా! ఏమి యీ స్వదేశాభిమానము! ఇట్టి స్వదేశాభిమాన మా నీయను గోల్పోయిన మనదేశముయొక్క దౌర్భాగ్య మింతయని చెప్పదరమైనదా!
బీదల దు:ఖమును జూచినంత తనకు దు:ఖమగుట యీమె నైసర్గిక గుణము. సాధ్యమైనంతవరకు దన ధనము బీదలకుపయోగపరచుట ఈమెకువెన్నతో బెట్టిన గుణముగా జదువరు లింతకు మున్నే యెరుగుదురు. అయి నను సర్వజనానుకరణీయమై యీ మెకుగల యీ గుణము యొక్క ప్రచారము నిచట మరి కొంచెము వివరించెదను; తరుచుగా ననేక పర్యాయములు రొట్టెలును, పప్పును వండించి గ్రామములోని బీదలకు, అనాథలకు దన యెదుట భోజనము పెట్టించి వాండ్లు తిని సంతసించుట జూచి తాను సంతసించు చుండెడిది. తనకు గుమారుడు పుట్టినపు డితరవిధములగు నుత్సవములు మొదలైనవానికై ధనము వ్యయము చేయక, యది కరువుకాల మైనందున నాధనమంతయు నసంఖ్యాకులగు బీదలకు, ననాథులకు గొన్ని దినములవరకు నన్నము పెట్టించుటయందు వ్యయపరచెను. తన్నాశ్రయించుకొని యున్న బీదవాండ్ల కన్యకలను దాను స్వయముగా సంబంధములు విచారించి తన ధనమును పెట్టి ధర్మ వివాహములను చేయుచు నా వియ్యాలవారు పెట్టెడి బాధలన్నిటికి దా దలయొగ్గి యనుభవించు చుండెడిది. ఈమె కడుపునబుట్టిన సంతానము లేక పోయినను, యీమె యింట నెల్లప్పు డైదారుగ్గురు పిల్లవాండ్రకు విద్యాదానము దొరుకుచుండెడిది. ఈ పిల్లల నందరి నెల్లవిధముల గడుపున బుట్టినవారి వలెనే చూచుచున్నందున దెలియనివా రా పిల్లలందరు నామె సంతానమనియే భావించుచుండిరి. అట్టి పిల్లలలో గొంద రామె బంధువులును, మరికొందరు పరాయివారునుగా నున్నను, వారిని, వీరిని నొక్క కంట గాంచి యాదరించు చుండెడిది. వారి కెన్ని యంగీలో వీరి కన్ని యంగీలు,