తమ వాక్యములవలన శౌర్యము పుట్టించి సంగ్రామము నడుపు చుండిరి. 3 వ తేదిని తమ్ము నెదిరించువారు లేక హూణబలంబులు పురమంతటను వ్యాపించెను. 4 వ తేదిని పట్టణమంతయు వారి స్వాధీనమాయెను.
తానిన్ని దివసంబులు చేసినశ్రమ వృధయపోవ శత్రువులు తన నగరము నాక్రమించుట గని రాణిగారు మిగుల విచారపడిరి. కాని యామె యంతటితో నైనా ధైర్యము విడువక కర్తవ్యము నాలోచించి జయోత్సాహులగు శత్రువులింక తనకిల్లా నాక్రమించి తనను బంధింతురని కని యామె యెట్లయిన రణరంగమున ప్రాణములువిడువ నిశ్చయించెను. అంత నామె పురుషవేషముతో బయలుదేర నిశ్చయించి తన దత్తపుత్రునియందధిక ప్రీతిగలదిగాన నా చిన్నవానిని తన మూపున గట్టుకొని అశ్వారోహణము చేసి నాల్గవతేది రాత్రి స్వల్ప సైన్యముతో నాంగ్లేయ సైన్యంబులతో బెనగుచు దాని బాయగా జీల్చికొని కాల్పీమార్గమున నరిగెను.
రాణిగారు తమ సైన్యములలో నుండి కాల్పీమార్గమున వెళ్ళిన సంగతి విని సర్ హ్యూరోజ్ దొరగారు సఖేదాశ్చర్యమగ్నులయిరి. ఆయన యంతటితో నూరకుండక యొక సేనా నాయకుని గొంత సైన్యసహితముగా నామెను వెంబడింప నంపెను. కాని రాణిగారు వారికి దృగ్గోచరముగాక తన గుర్రము నతిత్వరగా నడుపుచుండెను. జన్మాదిగా యుద్ధమన్నమాట యెరుంగక సదా రాణివాసమునందు వసియించు బ్రాహ్మణ వితంతువు వీరుల కభేద్యమగు హూణసైన్యమును