పుట:Abaddhala veta revised.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మారిపోయారు. బరోడిన్ ఆర్థిక యిబ్బందులను రాయ్ తీర్చాడు. జర్మనీ వారిచ్చిన ధనం ఆ విధంగా ఉపయోగపడింది. మెక్సికోలో రాయ్ దంపతులు ఆతిథ్యం స్వీకరించడానికి కమ్యూనిస్టు, సోషలిస్టు ప్రముఖులు అప్పుడప్పుడు ఆయన బంగళాకు వెళ్ళేవారు.

మెక్సికోలో రాయ్ దంపతుల చరిత్రాత్మక పాత్ర చాలా వరకు గ్రంథస్థమైంది.వారి ఖ్యాతి లెనిన్ వరకూ చేరడం, మాస్కో ఆహ్వానంపై రాయ్ దంపతులు 1920 జనవరిలో క్యూబా నుండి బయలుదేరి యూరోప్ దేశాల మీదుగా రష్యా చేరడం చరిత్ర కథనంగా వెలువడింది.ఎవెన్ జోస్ అనే పేరుతో రాయ్ ప్రయాణం చేశాడు.

రష్యాలో వుండగా ఎవిలిన్ తన కుటుంబంతో సంబంధాలు పెట్టుకునే వున్నది. ఉత్తరాలు రాసింది. పెట్రోగ్రాడ్, తాష్కెంట్, మాస్కో నుండి రాస్తూ ఎం.ఎన్.రాయ్ కార్యకలాపాలు, పెట్రోగ్రాడ్ లో ఒక ర్యాలీలో పాల్గొన్న ఫోటో, విశేషాలు రాసింది. రష్యా సాంఘిక పరిస్థితులు వివరించింది.

1920 అక్టోబరులో తాష్కెంటులో స్థాపించిన భారత కమ్యూనిస్టు పార్టీలో ఎవిలిన్ సభ్యురాలుగా వుంది. 1921లో మాస్కోలో స్టాలిన్, రాయ్ స్థాపించిన కమ్యూనిస్టు విశ్వవిద్యాలయంలో ఎవిలిన్ సిద్ధాంతాలు బోధించింది. 1938లో ఈ యూనివర్శిటీ మూసేశారు. ఎం.ఎన్.రాయ్ సోవియట్ యూనియన్ లో వుండగా అక్కడ నుండి మెక్సికో వెళ్ళిన ప్రముఖ చిత్ర నిర్మాత, డైరెక్టర్ సర్ గై అయిసెన్ స్ట్రెన్ మెక్సికోపై ఒక చిత్రం నిర్మించాడు. దాని పేరు క్యూ వివామెక్సికో. అంటే మెక్సికో వర్ధిల్లాలి అని అర్థం. ఆ చిత్రంలో మెక్సికో సమాజాభివృద్ధి నిర్మాతలలో ఒకరుగా ఎం.ఎన్.రాయ్ ను చూపారు. 1930 నాటికి చిత్రం పూర్తయింది. కాని విడుదల కాలేదు. చిత్రం పట్ల స్టాలిన్ అనాసక్తి అందుకు కారణం కావచ్చు. చిత్ర నిర్మాతకు ఉత్తరోత్తరా లెనిన్ అవార్డు లభించింది. 1949లో ఆయన చనిపోయాడు. ఆ తరువాత చిత్రం విడుదల కాగా అనేక అవార్డులు పొందింది. రాయ్ కు అలాంటి గుర్తింపు మెక్సికోలో వచ్చిందని చెప్పడానికి యీ ప్రస్తావన తెచ్చాను. న్యూయార్క్ మోడరన్ ఆర్ట్ మ్యూజియంలో యీ ఫిలిం వుంది.

సోవియట్ యూనియన్ లో యూరోప్ చైనాలో ఎం.ఎన్.రాయ్ పాత్ర గురించి చాలా గ్రంథాలు వెలువడ్డాయి. అయినా ఇంకెంతో బయటకు రావలసింది వుంది. నేటి పరిస్థితుల దృష్ట్యా మాస్కోలో పరిశోధిస్తే అనేక సంగతులు తెలుస్తాయి. అలాంటి పరిశోధన జరగవచ్చు. 1920-30 మధ్య రాయ్ గురించిన అనేక విషయాలు మాస్కో కె.జి.బి.రికార్డులలో వున్నాయని,చాలా వరకు రష్యన్ భాషలో వున్నాయని తెలుస్తుంది.

ఎవిలిన్ ఇంగ్లండ్ ఎందుకు వెళ్ళింది?

భారత కమ్యూనిస్టు పార్టీని 1920 అక్టోబరులొ స్థాపించిన అనంతరం తాష్కెంట్ నుండి తిరిగి మాస్కోకు వచ్చిన ఎం.ఎన్.రాయ్, ఎవిలిన్ లు విపరీత కృషిలో నిమగ్నులయ్యారు. 1921 మేలో ఎవిలిన్ ఇంగ్లండ్ వెళ్ళింది. రెవల్(టాలిక్) నుండి ఆమె ఇంగ్లండ్ లోని డోవర్ చేరుకున్నది.