పుట:Abaddhala veta revised.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తీవ్రస్థాయిని సంతరించుకున్నది. ఇదొక ఫాసిస్టు లక్షణంగా కాంగ్రెస్ కు,ఇతర పార్టీలకు అనిపించింది.

గాంధీజీని నాధూరాంగోడ్సే 1948 జనవరి 30న ఢిల్లీలో కాల్చి చంపిన తరువాత, ఆర్.ఎస్.ఎస్.ను ప్రభుత్వం నిషేధించింది. గొల్వాల్కర్ ను అనేకమంది ఆర్.ఎస్.ఎస్. వారిని నిర్భంధించారు. చట్టవ్యతిరేక సంస్థగా ఆర్.ఎస్.ఎస్.ను పేర్కొన్నారు. తమపై నిషేధం తొలగించమని ఆర్.ఎస్.ఎస్. డిసెంబరు (1948)లో సత్యాగ్రహం చేసింది. ఆర్.ఎస్.ఎస్. లక్ష్యాలను లిఖితపూర్వకంగా తొలిసారి ప్రకటించారు. 1949 జులై 8న నిషేధం తొలగించారు. రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రావడానికి గోల్వాల్కర్ నిరాకరించారు. నెహ్రు మంత్రిమండలిలో వున్నా డా॥శ్యాంప్రసాద్ ముఖర్జీని ఒప్పించి, ఒక హిందూ సంస్థను రాజకీయపరంగా స్థాపించడానికి పూనుకొన్నారు. వసంతరావు ఓక్ ఇందులో ప్రధానబాధ్యత స్వీకరించారు. ఆర్.ఎస్.ఎస్. లోపాయికారిగా మద్దతు యిచ్చే అంగీకారంతో జనసంఘ్ పార్టీ ఏర్పడింది.

1948లో ఆర్.ఎస్.ఎస్.ను నిషేధించిన తరువాత ఎత్తుగడల రీత్యా గోల్వాల్కర్ అనేక ప్రకటనలు చేసినా, మూల లక్ష్యం నుండి మారలేదు. హిందువులను సంఘటిత పరచడం, ముస్లిం వ్యతిరేకత,సెక్యులర్ వ్యతిరేకత స్పష్టంగా బయటపెట్టారు. జనసంఘ్ తోనూ, తరువాత భారతీయ జనతాపార్టీగా మారిన రాజకీయ పక్షంతోనూ ఆర్.ఎస్.ఎస్. సన్నిహితంగా వున్నది. ఈ విషయమై తరచు వివాదం తలెత్తింది. 1978లో కేంద్రంలో జనతాపార్టీ అధికారంలోకి వచ్చినపుడు బి.జె.పి. ద్వంద్వ సభ్యత్వంపై గొడవ చెలరేగింది. ఇందిరాగాంధి ఎమర్జన్సీ ప్రవేశపెట్టినప్పుడు ఆర్.ఎస్.ఎస్. ప్రతిఘటించింది. కొందరు నిర్భంధానికి గురైనారు. గోల్వాల్కర్ వారసుడుగా సర్ సంఘ్ సంచాలకుడుగా దేవరజ్ వచ్చారు. జనసంఘ్,భారతీయ జనతా పార్టీలలో చాలామంది ప్రముఖులు ఆర్.ఎస్.ఎస్.నుండి వచ్చిన వారున్నారు. గోల్వాల్కర్ అభిప్రాయాలు అధ్యయనం చేసే ఆర్.ఎస్.ఎస్. వారు హింస సంఘటన విషయమై ఫాసిస్టు ధోరణి అవలంభించారు. హిందువులతో సమానంగా ముస్లింలకు,క్రైస్తవులకు సమాన హక్కులివ్వడం ఆర్.ఎస్.ఎస్.కు యిష్టం లేదు. దేశంలో పునర్వికాసానికి ఆర్.ఎస్.ఎస్. ప్రధాన అడ్డంకిగా నిలిచింది. మానవ హక్కులను,సమానత్వాన్ని హర్షించలేని యీ సంస్థ సంకుచిత సంస్కృతిని సమర్ధిస్తున్నది. 20వ శతాబ్దం నుండి 21వ శతాబ్దంలోకి పోవాల్సిన దేశాన్ని,వెనక్కు నడిపించాలని ఆర్.ఎస్.ఎస్. ప్రయత్నిస్తున్నది. అధిక సంఖ్యాకులైన హిందువులకు అప్పుడు ముస్లింలను,క్రైస్తవులను బూచిగా చూపి,కరడుగట్టిన సిద్ధాంతాలను యింకా ఆర్.ఎస్.ఎస్.నూరుపోస్తున్నది. ఈ సంస్థ అభిప్రాయాలను యధాతధంగా కాకున్నా, సడలించిన ధోరణిలో భారతీయ జనతా పార్టీ ప్రతిబింబిస్తున్నాయి.

అంటరానితనాన్ని, కులాన్ని కాదంటున్న బి.జె,పి హిందూ సంస్కృతే భారతీయ సంస్కృతి అంటున్నది. రాజకీయాలలో చురుకుగా వుండదలచిన యీ పార్టీ కొంత పట్టు విడుపులతో