పుట:2015.392383.Kavi-Kokila.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవికోకిల గ్రంథావళి


మాధ : పరుగెత్తితిని. నేను పోవునప్పటికి ఆ పంది రాజశేఖరునిపైకి దుముకుచుండెను. ఆతఁడు దానిని కత్తితో తప్పించుకొనుచుండెను. నే నొక్కనిమిష మాలసించి యుందునేని బెదరియుండిన ఆ యేదుపంది పాపము! రాజశేఖరుని చీల్చి వేసియుండును.

శాంత : దానిని పొడిచి నీవు రాజశేఖరుని కాపాడితివా? నిన్ను సాఁకిసంతరించిన ఋణమును తీర్చుకొంటివిగదా?

మాధ : దాని డొక్కలో నా కరవాలముతో నొక్కపోటు పొడిచితిని. అది రాజశేఖరుని వదలి నాపైకి దుమికెను. నేను తప్పించుకొని కత్తి నూడబెరుకునంతలో నది యొరఁగఁబడెను. అందువలన నాకరవాలము మొన విరిగిపోయెను, ఆ తునకయే యిది.

విజ : అట్లయిన దాని కళేబర మేమైయుండును? ఒకవేళ అడవి మృగములు తిన్నను అస్థిపంజరమైన నుండవలయునుగదా?

మాధ : అదియె దురూహ్యముగనున్నది.

విజ : తరువాత అచ్చటనుండి మీ రిరువురు కలిసికొని వచ్చితిరా?

మాధ : రాజశేఖరుఁడు కలవరమంది కొంతవఱ కచ్చటనే నిలిచి యుండెను. నాచేత రక్షింపఁబడెనన్నభావము ఆతనికి లజ్జాకరముగ నుండుటను గ్రహించి నే నచ్చటనుండక ఇంటివంకకు మరలివచ్చితిని. ఇంతవఱకె నాకుతెలియును.

విజ : [స్వగతము] ని న్నురితీయించుట కింతకన్న నెక్కుడవసరము లేదు.

శాంత : అట్లయిన రాజశేఖరుఁడేఁడి?

మాధ : నేనుకూడ అదేప్రశ్న అడుగవలయును. - నా కేదియో కొంత సందేహము కలుగుచున్నది. మరల నొకమా ఱాప్రదేశమునకు పోయి చూచివచ్చెదను.