సప్తమాంకము] సీతావనవాసము 103
నేలనాలుగు చెఱగులు నేలఁజాలు
వీరవీరులు కుశలవుల్ వెలఁదిమిన్న,
అట్టికొమరుల సౌఖ్యంబు నరసియైనఁ
గాంతు సన్నిధిఁ గాలంబుఁ గడపుమమ్మ.
సీత : నాయనా, సర్వమెఱింగిన మీరే యిట్లాడుచున్న నిఁక నే నేమిపలుకఁగలను ? ఆర్యపుత్రునకు నాకన్నను గుమారులకన్నను కీర్తియే గదా యాదరణీయము.
వాల్మీ : కుమారీ, నిన్ను మరలఁ బరిగ్రహించుటవలన రామచంద్రుఁ డపకీర్తివంతుఁ డౌనని యెంచెదవా ?
సీత : ప్రజ లట్లు తలంతురు.
వాల్మీ : అమ్మా, లక్ష్మణునివలన నంతయు నెఱింగితిని. నిన్ను వనములకుఁ బంపినందులకు జనులు రామచంద్రుని తొందరపాటును దూలనాడు చున్నారఁట !
సీత : ఆహా ! యేమి లోకుల చిత్తచాంచల్యము !
నోటి కడ్డమాఁకయులేక మాటలాడి
సత్యము నసత్యమెఱుఁగరు జడహృదయులు;
గాలివీచిన యట్లెల్లఁ గదలియాడు
కేతనాంచల మటు వారి చేత మలరు.
వాల్మీ : జానకీ, జనసామాన్యము కర్ణధారిలేని నావవలె ముందు వెనుకకుఁ ద్రుళ్ళింతలాడుచు అనేకవిధములఁ బోవుచుండును.
సీత : నాయనా, యశ్వమేధ మొనరింప సమకట్టిన యార్యపుత్రుఁడు నూతనముగ సహధర్మచారిణిని బరిగ్రహించి యుండునుగదా !