పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

322

భక్తచింతామణిశతకమున మొదటి యిరువదిమూఁడుపద్యములలో నంత్యనియమాలంకారముంటచేఁ బద్యములు చదువఁ జవులూరుచున్నవి. కడమపద్యములలో శివలీలలు పురాణకథలు నభివర్ణింపఁబడినవి. శతకమునందలి కవితాధార మనోహరముగ నిరర్గళముగా నున్నది. కవి యీశతకమునందు మత్తేభవృత్తములు శార్దూలవృత్తములు వ్రాసి, యటుల వ్రాయుటకుఁ గారణ మీక్రిందివిధముగా మనోహరముగాఁ జెప్పియున్నాఁడు.

నీవు వెలయన్ మత్తేభశార్దూలచర్మములం బ్రీతి
వహింతు గాన నిపుడే మత్తేభశార్దూలపద్య
ముల న్నీ కుపహార మిచ్చితి....

కవి తాను నియోగియు బీదవాఁడునై యుంటచే గాఁబోలును ఎనుబదియెనిమిదవపద్యమున నియోగియై జనించుటయు నందు దరిద్రుఁడగుటయుఁ బాపహేతువని చెప్పినాఁడు. పద్యములందలి భావములు శైలి మనోజ్ఞముగా నుంటచే నీశతకములసంపుటమునం దీభక్తచింతామణిశతకమును జేర్చి ప్రకటించితిమి.

నందిగామ

ఇట్లు భాషాసేవకులు,

23-10-25

శేషాద్రిరమణకవులు, శతావధానులు.