పీఠిక
భక్తచింతామణిశతకమును వ్రాసినకవి కూచిమంచి సోమసుందరుఁడు. ఈకవి కోనసీమయందలి సప్తగోదావరిమధ్యముననున్న పలివెలగ్రామనివాసి. కవి తననివాసస్థానమును నీశతకమునం దీవిధముగాఁ జెప్పెను.
పల్వలపూర్థామ... ప. 5.
మహాగౌతమీవిలసత్తీరతలస్థపల్వలపురీ
విఖ్యాతవాసుండ...108
ఈకవి వ్రాసిన యితరగ్రంథములలో కొప్పులింగేశ్వరశతకము మాత్రము ప్రకృత ముపలభ్యమైయున్నది. సోమసుందరకవిని గూర్చినవృత్తాంత మింత కెక్కుడు తెలియరాదు. ఈకవి సుప్రసిద్ధులగు కూచిమంచి తిమ్మకవి జగ్గకవి సోదరుల కావలివాఁడై యుండును. ఎంతకాలముక్రింద నీకవి యుండెనో యేయే గ్రంథములు రచించెనో తెలియుట లేదు. పల్వెలపురీవిఖ్యాతవాసుండ ననుటచే నీకవి పల్వెలనివాసి యని స్పష్టముగాఁ దెలియుచున్నది. కవి కూచిమంచి తిమ్మకవివంశీయుఁడు గావున కౌండిన్యసగోత్రుఁ డనియు నాపస్తంబసూత్రుఁ డనియుమాత్రము తెలిసికొనవచ్చును.
పలివెల సుప్రసిద్ధమగు శివక్షేత్రము. ఇట రెడ్డివీరులు నెలకొల్పిన శాసనములు పెక్కులుగలవు.