పుట:2015.370800.Shatakasanputamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

ఈ వృషాధిపశతకమును వీరశైవమతస్థాపకు డగుబసవేశ్వరుని లీలల నభివర్ణించుచు నాంధ్రకవులలో బేరెన్నికగన్న పాలకుఱికి సోమనాథమహాకవి రచించెను. ఇందు వర్ణింపఁబడిన బసవేశ్వరుఁడు నందీశ్వరునియంశమువలన నొకపుణ్యదంపతుల కుదయించి పసితనముననే సమస్తవిద్యాపారంగతుఁడై యుపనయనాదిబ్రాహ్మ్యధర్మము లుల్లంఘించి సంగమేశ్వరాలయమున నీశ్వరసాక్షాత్కారమునొంది వీరశైవమత ప్రచారము చేయ బయలువెడలి స్వప్రతిభాతిశయములవలన కల్యాణపురరాజ్యము పరిపాలించు బిజ్జలునివద్ద మంత్రిగాఁ బ్రవేశించి మతాభివృద్ధిఁ జేయసాగెను.

బిజ్జలుడు జైనుఁడగుటవలన బసవేశ్వరునకు బిజ్జలునకుఁ ద్వరలో విరోధము పొసంగెను. పిదప బసవేశ్వరుఁడు మతాభినివేశపరవశులగు జంగముల సహాయముచే బిజ్జలుని జంపించి జైనుల నిర్మూలము గావింపఁజేసి వీరశైవమతము ప్రపంచమున సాట బయలువెడలెను. బసవేశ్వరుని సమకాలికులలో అల్లమప్రభువు, చెన్నబసవన్న, మల్లికార్జునపండితారాధ్యులు మిగుల సుప్రసిద్ధులు. మల్లికార్జునపండితారాధ్యులశిష్యుఁడే యీపాలకుఱికి సోమనాథమహాకవి.