పుట:హాస్యవల్లరి.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాటలేనా!!

పాతపట్నం సివారు పెరుగుపిల్లి అనే ఒక జమీందారీ గ్రామం ఉండేది. ఆవూళ్ళో సిమాలమ్మ అనే ఒక వ్యక్తి ఉండేది. మొదణ్ణించీ ఆవిడ అక్కడే ఉంది. ఆవిడ పుట్టింటారంతా బుగ్గి అయిపోడం, మాటలు ఇంకా సరిగ్గారాని వయస్సులోనే ఆవిడికి అత్తారింటే పెళ్ళవడం, పెళైన పదహారో పండగ ఇదవకుండానే ఆవిడ ఐదోతనంకాస్తా అస్తా యిస్తయిపోవడం లాంటివి కుట్ర జరిగినట్టు జరిగిపోయాయి. మాటొచ్చినప్పుడు పేరంటాళ్ళు “సిమాలమ్మ ఎంతదొడ్డ అయితేం పెట్టి పుట్టద్దూ! బొట్టుపెట్టీ, కాటిక్కాయా ఎరగదుకదా!' అంటూ కళ్ళు తుడుచుగునేవారు. అత్తమామలకి ఇతర సంతతి లేక పోబట్టి, ఆవిడ అత్తారింటికి వెళ్ళిన వెళ్ళడం ఏకవెళ్ళడం అయిపోయి, అక్కడే పాతుగు పోవలిసొచ్చింది. ఆవిడికి పాతిగేళ్ళు వచ్చేదాకా అత్తగారుగ్రహం, ఏసాదింపోసాదిస్తూ, విగ్రహం కంటికి కనపడుతూ ఉండేది. మరి తరవాత ఇహ ఎవరున్నారూ! బిక్కుబిక్కుమంటూ కార్తీక దీపంలాగ మామగారొక్కడూను! ఆకాస్త మామగారూ కూడా వచ్చేప్రాణం పోయే ప్రాణంకింద మంచంమీద ఏణ్ణర్థం ఉయ్యాలా ఊగి, ఆవిడ ముప్పైయ్యోయేటే బ్రహ్మాండం మీద పోయాడు. అప్పణ్ణించి, ఆవిడ, అటూ ఎవరూ లేక ఇటూ ఎవరూ లేక ఘంటస్తంభంలాగ ఒక్కర్తీ నిల్చిపోయింది. బతికున్నజ్ఞాతులు ఎవరూ లేకపోడంచే వారసత్వపు గొడవలు ఆవిడచెవిని పడవలసిన అవసరంపోయింది. ఆవిడ పెంచుకోనూలేదు. ఏటా ఓ ఇరవై కాటాబస్తాల ధాన్యం, ఓ బొద్దుగడ్డీ, గుమ్మంలోకి తెచ్చి ఆవిడ కాళ్లదగ్గిర అప్పగించేవారు. ఆవిడదగ్గిర రెండువేలు చేసే బంగారపు తొడుగుండేది. ఆవిడపేర రెండువేలపైమాట వడ్డీకి తిరుగతూండేది. ఆవిడికి పట్టుమని బంధువులేనా లేరు, ఏ బీరకాయపీచో, ఆవిడ ఇంటిపేరుకి నోట్లల్లోనూ పత్రాల్లోనూ తప్పవాడకమే లేదు. దాని మూలాన్ని ఆవిడికి పురుడు పుణ్యాలూ, కష్టసుఖాలకి రాకపోకలూలాంటి కుటుంబసంబంధమైన తప్పనిసరి మొహమాటపు తగులుబాట్లు కించిన్మాత్రం లేకుండాపోయాయి. ఆవిడికి గవ్వ ఖర్చులేదు. అందులోనూ ఆవిడ స్వతహా ఇరుకుచేతి మనిషి. అవునా, తను దంతసిరితో పుట్టిందిగదా, ఇంతఅన్నోదకాలకి మొహం వాయక్కర్లేదు గదా, ఒహటో రకమైన వసతి కట్టుదిట్టంగా ఖంజాయింపై ఉందిగదా, చెయ్యిములగా పాడిగదా, పరగణా అంత భవంతి స్వంతానికి ఉందిగదా, అల్లాంటప్పుడు తనవేళకి తనయింటో, తనసొమ్ము ఇతరులకి పెట్టదు పోనీ! తను తింటూ ఉండిపోతే రోజులు దొర్లిపోవూ! దేవాసురులుకూడా ఎగిరిగంతెయ్యరూ! మరె! ఆవిడ అల్లా ఉంటుంది! రమ్మంది, తిమ్మన్నబంతికి! అల్లాంటివాళ్ళు అల్లా ఉంటే కావలిసిందేమిటిహ! అపూర్వమైన స్వంతపైత్యం ఏదోఓటి వీధిని పడాలి, వ్యక్తిత్వంలో ఉండే ప్రత్యేకత స్థాపన కావాలి. అందుకని, అంత నిప్పులాంటి మనిషి ప్రజలనోట పడింది.

ఇంట్లో పనున్నప్పుడు తప్ప ఆవిడ తన వీధి అరుగు ఎడంవేపుది - వదిలేది కాదు. ఇల్లెంతున్నా యజమానికి, ఇంట్లో ఒక్కొక్క స్థలం మరీ స్వస్థలం కనిపిస్తూండి, అక్కడికి చేరుకుంటేనేగాని మనస్సు స్థాయీపడదు. రాత్తెళ్లుకూడా చాలాభాగం ఆవిడ

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

145

హాస్యవల్లరి