సింహాసన ద్వాత్రింశిక
ఆ.వె. వేముగల్లు జన్మభూమిగాఁ బెరిఁగియు
[1]దీపులెల్ల మాటఁ దేటపఱిచి
హరిపదైకబుద్ది హరితగోత్రాంబుధి
రాజనంగఁ గసవరాజు మించె. 53
క. తంత్రముచేఁ గార్యము పర
తంత్రము గాకుండఁ బతిహితమె చేయు మహా
మంత్రులలోపలఁ గసవయ
మంత్రి విచారమున దివిజమంత్రియుఁ బోలెన్. 54
వ. ఇట్టి మంత్రిశిరోమణికి నునికిపట్టగునట్టి పట్టనం బెట్టిదనిన. 55
శా. రాణామల్లన కీర్తిచంద్రికలు పర్వం బొంగి మధ్యాశ్రిత
క్షోణీభృద్వనదుర్గమై గుణమణిస్తోమంబుల న్నిండియ [2]
క్షీణశ్రీపురుషోత్తమాశ్రయమునై చెల్వారి దానామృత
శ్రేణిం ద్యాగసముద్రనామము వహించె న్వేముగ ల్లీమహిన్. 56
వ. ఇట్టి పురంబునందు. 57
క. పూజితు లగుకవులకృపన్
భ్రాజిష్ణుఁడఁ గొంత [3]అష్టభాషావిదుఁడన్
రాజనుతుఁ డైన కసవయ
రాజతనూభవుఁడ గోపరా జనువాఁడన్. 58
శా. చిత్రఖ్యాతి [4]వితీర్ణివిక్రమనిధి శ్రీవిక్రమాదిత్య చా
రిత్రఖ్యాపనశాసనంబులకు భూరి స్తంభసంభారమై
ధాత్రీపాలురుఁ గావ్యవేదులును మోదం బంద సింహాసన
ద్వాత్రింశత్కథల న్గుణంబులుగఁ గావ్యం బొప్పుగాఁ జెప్పెదన్. 59
వ. ఆది యెట్టిదనిన. 60